పాపన్నపేట ,మార్చి 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట లో నిర్వహిస్తున్న శ్రీరామ సీతా ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు.
ముఖ్యంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీరామచంద్రుని మొక్కు కున్నట్లు ఆమె వెల్లడించారు. గ్రామస్తులు సమిష్టి కృషితో ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆలయ ప్రతిష్టా కార్యక్రమం ఈనెల 25 వరకు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.