మెదక్/సంగారెడ్డి ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఇసుక కొరత మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్కు రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే, మెదక్ జిల్లాలో రీచ్లు, క్వారీలు లేకపోవడంతో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లభించక నిర్మాణదారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కొరతతో ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో ఇసుకు వ్యాపారులు ధరలను ఆమాంతం పెంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో అనుసరిస్తున్న వైఖరి కారణంగానే ధరలు అమాంతం పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇసుక ధరలు ఒక్కసారిగా పెరగడంతో సొంతింటిని నిర్మించుకుంటున్న మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాలో పెద్దఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇసుక ధరలు మునుపెన్నడూ లేనంత స్థాయికి పెరగడంతో వారి ఆర్థిక అంచనాలు తలకిందులయ్యాయి. ఇసుక కొరత ఇలాగే కొనసాగితే నిర్మాణాలు ఆగిపోతాయేమోనని భయపడుతున్నారు. ప్లాస్టరింగ్కు వినియోగించే సన్న ఇసుకకు సైతం భారీగా డిమాండ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలో ఎక్కడా సన్న ఇసుక దొరకడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ఫిల్టర్ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది ఉన్నప్పటికీ ఎక్కడా ఇసుక రీచ్లు లేవు. దీంతో జిల్లాలో గృహ, ఇతర నిర్మాణాలు, ఇంటి మరమ్మతు పనులు చేపట్టే వారంతా కాళేశ్వరం, బిచ్కుంద ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు టన్ను ఇసుక ధర రూ.1200 వరకు ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ.1600 నుంచి రూ.1700 వరకు చేరుకుంది. రవాణా చార్జీలు అదనంగా చెల్లించాల్సి రావటంతో మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. పెరిగిన ధరలను వెంటనే నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుత ధరలతో బిల్డర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రకటించిన స్వేర్ఫీట్ కంటే ఇప్పుడున్న ప్రకారం రూ.100 నుంచి 200 వరకు అదనంగా ధర పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ భారమంతా ఇండ్లు కొనుగోలు చేసే వారిపై వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు కూడా తమ వల్ల కాదంటూ పనులు నిలిపివేస్తున్నారు.
ఇసుక ధరలు పెరగటంతో సంగారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఊ పందుకుంది. సంగారెడ్డి, హత్నూర మండలాల్లో కొంతమంది అక్రమం గా ఇసుక ఫిల్టర్లను నడుపుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇటీవల కాలం లో సంగారెడ్డి, కంది మండలాల్లో ఆకస్మిక దాడులు చేపట్టి ఫిల్టర్లను కూల్చివేశారు. అయితే, కాళేశ్వరం నుంచి వచ్చే ఇసుక ధర అమాంతంగా పెరగటంతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న కొంతమంది ఫిల్టర్ ఇసుక వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా మూసివేసిన ఇసుక ఫిల్టర్లను మళ్లీ తెరిచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి టన్ను ఫిల్టర్ ఇసుకను రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.