రెండో విడత కంటివెలుగు 86రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీర్ఘకాలంగా దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో 8,537 మందికి, మెదక్ జిల్లాలో 16 బృందాల ఆధ్వర్యంలో 2082 మందికి ఐ టెస్ట్లు చేశారు. అవసరమైన వారికి మందులు, కండ్లద్దాలు అందజేశారు. శస్త్రచికిత్సల కోసం నగరంలోని దవాఖానలకు రెఫర్ చేశారు.
– సంగారెడ్డి/ మెదక్, న్యూస్నెట్వర్క్, మే30
మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4,43,645 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,11,078 మంది పురుషులు, 2,32,567 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు 40,943 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 41,449 మందికి అద్దాల కోసం ఆర్డర్లిచ్చారు. జిల్లాలో మంగళవారం 86వ రోజు కంటి వెలుగు శిబిరాల్లో 16 బృందాలు పాల్గొని, 2082 మందికి కంటి పరీక్షలు చేశారు. 215 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 259 మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డిలో కొనసాగుతున్న కంటి వెలుగు
సంగారెడ్డి కలెక్టరేట్, మే 30: సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నది. మంగళవారం జిల్లాలో మొత్తం 8,537 మందికి కంటి పరీక్షలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 6,847 మందికి, పట్టణ ప్రాంతాల్లో 1,330 మందికి, జీహెచ్ఎంసీ పరిధిలో 360 మందికి కంటి పరీక్షలు చేశారు. 549 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 459 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలకు అర్డరిచ్చారు. 840 మందికి శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య
న్యాల్కల్, మే 30: తాగిన మైకంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మల్కన్పాడ్ గ్రామంలో మంగళవారం జరిగింది. హద్నూ ర్ ఎస్సై వినయ్కుమార్ కథనం ప్రకారం.. మల్కన్పాడ్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీనివాస్రెడ్డి (35) సోమవారం రాత్రి తాగిన మైకంలో ఇంటి నుంచి వెళ్లి తన పొలం లోని వేప చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్కుమార్ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
మునిపల్లి, మే 30: కూలీ పనుల నిమి త్తం వచ్చిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని తాటిపల్లిలో చోటుచేసుకున్నది. ఏఎస్సై భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిట్టగుప్ప ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ పాష తన మామతో కలిసి తాటిపల్లి గ్రామంలో ఐదు రోజుల క్రితం పత్తి నింపేందుకు వచ్చాడు. కూలీపనులకు వచ్చి కనిపించకుండా పోయా డు. ఆచూకీ తెలిసిన వారు 87126 56749, 87126 56722లకు సమాచారం అందించాలని ఏఎస్సై తెలిపారు.