శివ్వంపేట, అక్టోబర్ 27 : వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై ఓటర్లకు అవగాహన సమావేశాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహణి ప్రియదర్శిని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు. అధికారులు అందరూ ప్రజలకు ఓటు చైతన్యవంతులుగా తయారు చేయాలని పిలుపు నిచ్చారు. ఎవ రు ఎన్ని ప్రలోబాలకు గురిచేసినా ఎవరికీ లొంగకూడదని, ఓటు బ్రహ్మాస్త్రం అని అన్నారు. దేశాన్ని ప్రభావితం చేసే శక్తి అని, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటు విలువ సమానంగా ఉంటాయన్నారు. ఓటు దుర్వినియోగం చేయకూడదని, ఎవరైనా ఓటు నమోదు చేసుకోక పోతే, ఈ నెల 31 వరకు అవకాశం ఉందని, ఓటింగ్లో గతంలో 3వ స్థానంలో ఉన్న జిల్లా మొదటి స్థానంలో ఉంచాలన్నారు. ఓటర్లకు నవంబర్ 10 నుంచి 25తేదీ వరకు ఓటరు గుర్తింపు స్లీప్లు అందజేస్తామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటరు అసిస్టెంట్ బూత్ను ఏర్పాటు చేస్తామని ఏదైనా ఓటరుకు సందేహం ఉంటే ఓటరు అసిస్టెంట్ బూత్లో చెక్ చేసుకోవచ్చని అన్నారు.
ఓటింగ్ రహస్య పద్ధ్దతిలో జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో ఓటరు చైతన్య రథం ద్వారా ప్రచారం చేస్తున్నదని, 100 శాతం ఓటింగ్ లక్ష్యం గా ప్రచారం చేస్తుందని తెలిపారు. ఓటరు చైతన్య రథం జిల్లాలో ప్రధాన కూడళ్లు, మార్కెట్స్, బస్ స్టాండ్ లు, జాతరలు, షాపింగ్ మాల్స్, కాలనీల్లో ప్రచారం చేస్తుందని, కళాకారులు ఆట పాటలతో ప్రజలకు చైతన్యం కల్గించాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఏదైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చని, కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని డబ్బు, మద్యం, ఏదైనా వస్తువుల పంపిణీ జరిగినా నేరు గా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలియజేశారు. అంతకుముందు ఓటింగ్లో భాగస్వా మ్యం కావాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరిరెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాసులు, రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీవో భారతి, ఎంఈవో బుచ్యానాయక్, సీఐ శ్రీధర్, ఎస్సై రవికాంత్రావు, తెలంగాణ సంస్కృతిక శాఖ కళాకరులు, ఓటర్లు పాల్గొన్నారు.