మెదక్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరు వులు, కుంటలు నిండడంతోపాటు ప్రాజెక్టులు నిండుతు న్నాయి. వర్షంలోనే రైతులు పొలం పనులు చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మొదలైన ఎడతెరిపి లేనివానతో పరిస్థితి ఒకసారిగా మారింది. ప్రస్తుతం జిల్లాలో వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంది. ఇలాగే కురిస్తే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులకు ఊరట లభించింది. వర్షాకాలం మొదలై నెలన్నర దాటినా బోసిపోయినట్టుగా ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటిమట్టంతోపాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురు స్తున్న వానలతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో వరి నాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
పొంగిపొర్లుతున్న ఘనపూర్ ప్రాజెక్టు…
మంజీరా నదిపై కొల్చారం – పాపన్నపేట మండలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో ఘనపూర్ మధ్య తరహా ప్రాజెక్టు నిర్మించారు. ఆనకట్ట పొడవు 2,337 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 0.135 టీఎంసీలు. ఇప్పటికే 0.135 టీఎంసీల నీటిని దాటి 12,500 క్యూసెక్కుల నీటి తో ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మొత్తంగా ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 27 వేల ఎకరాల్లో పంటలు పండుతాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఘనపూర్ పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్నహర్, ఫతేనహర్) ఉన్నాయి. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు. మహబూబ్ నహర్ (ఎంఎన్ ) కెనాల్ పొడవు 42.80కిలోమీటర్లు. ఈ కాలువ ద్వారా కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్ (ఎఫ్ఎన్) కెనాల్ పొడవు 12.80 కి.మీ. దీని పరిధిలో పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ ర్షాలకు ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో ఆయకట్టు కింద ఉన్న పొలాల్లో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల పరిధిలోని రైతులు కూడా వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ముసురుతో పంటలకు జీవం…
సీజన్ ప్రారంభమై నెల గడిచినా సరైన వానలు లేక రైతు లు ఇబ్బందులు పడ్డారు. కాగా, రెండు రోజులుగా కురుస్తు న్న ముసురుతో రైతాంగానికి ఊరట కలుగుతున్నది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలతో వరినాట్లు జోరందుకున్నాయి.
అధికారులు అప్రమత్తం…
కలెక్టర్ రాజర్షిషా ఆదేశాలతో వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ జిల్లాకేంద్రంలోని వెంకట్రావ్నగర్, రషీద్కాలనీ, ఆటోనగర్లో గురువారం పర్యటించారు. రోడ్లపై నిలిచిన నీటిని పరిశీలించారు. హవేళీఘనపూర్ మండలంలోని సర్ధన, ముత్తాయికోట గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.