జగిత్యాల, ఆగస్టు 15: ‘కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని అరచేతిలో వైకుంఠం చూపించింది. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఆశలపల్లకీలో ఊరేగించింది. అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా పట్టించుకోవడం లేదు. హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని’ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్ రావు, జిల్లా డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జాతీయ జెండాను జీవన్డ్డి ఆవిషరించారు. జాతీయ గీతం ఆలపించారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు గడుస్తున్నదని, అయితే నాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నెపంతో తెలంగాణను ఆంధ్రాలో కలిపి అన్యాయం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, హకుల కోసం కేసీఆర్ కొట్లాడారని, అనేక మందిని కూడగట్టుకొని 14 ఏండ్లపాటు ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. అయితే బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోతే మరమ్మతులు చేపట్టకుండా రేవంత్ రెడ్డి కావాలనే జాప్యం చేస్తున్నారని, రైతులపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చి అన్నింటికీ ఎగనామం పెడుతున్నదని, రైతుబంధు ఉందో లేదో తెలియదని, రైతుబీమా కనుమరుగైపోతున్నదని ధ్వజమెత్తారు. పేదింటి కుటుంబాలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి పథకంపై కోర్టులో పిల్ దాఖలైతే ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం చూస్తుంటే రేవంత్రెడ్డికి నిరుపేదలపై శ్రద్ధ ఎంత ఉందో అర్థమైపోతున్నదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తామని ఆశల పల్లకీలో ఊరేగించి నిండా ముంచారని మండిపడ్డారు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం నుంచి ప్రారంభించే పెన్షన్లలో వృద్ధులు, బీడీ కార్మికులకు అవకాశం లేకుండా చేశారని, రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి వర్గం మోసపోతోందని ఆగ్రహించారు.
తెలంగాణలో గతంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీ జనాభా 5 శాతం తగ్గించారని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల ప్రజలు విసిగిపోయారన్నారు. దావ వసంత మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చూపిన పోరాటాన్ని మరోసారి గుర్తు చేసుకుని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ అయిల్నేని వెంకటేశ్వర్ రావు, ఆనందరావు, గంగారెడ్డి, గాజుల రాజేందర్, అనురాధ, విజయలక్ష్మి పాల్గొన్నారు.