ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. పెద్దపెద్ద వడగండ్లు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడక్కడా ఇళ్ల పైకప్పులు ఎగిరిపడగా.. మరి కొన్ని చోట్ల చెట్లూ, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో జన జీవనం ఇబ్బందిపడింది.
కోహీర్, ఏప్రిల్27: కోహీర్తో పాటు కొత్తూర్, ఖానాపూర్, బిలాల్పూర్, మనియార్పల్లి, గొటిగార్పల్లి, పర్సపల్లి, రాజనెల్లి, గురుజువాడ, దిగ్వాల్, తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దపెద్ద సైజులో వడగండ్ల వాన కురవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈదురుగాలుల తీవ్రతకు పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది.
జహీరాబాద్, ఏప్రిల్ 27: జహీరాబాద్ పట్టణంతో పాటు మొగుడంపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని రాంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్ రేకులు గాలికి ఎగిరిపోయాయి. మొగుడంపల్లిలో 8.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జహీరాబాద్లో 4 సెంటీ మీటర్లు, మల్చల్మాలో 6.5, అల్గోల్లో 3.6, సత్వార్లో 2.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ గాలులకు మామిడికాయలు రాలి పోయాయి. జొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది.