నర్సాపూర్, మే 20: సకాలంలో ధాన్యం తూకం వేయక, తూకం వేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించక పోవడంతో రైతుల బతుకులు ఆగమైతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో హమాలీల కొరత ఉందని ధాన్యాన్ని తూకం వేయడంలో జాప్యం చేశారు. ఆ తర్వాత తేమశాతం పేరుతో రైతన్నలను ఇబ్బందులకు గురిచేశారు. తూకం వేశాక, లారీల కొరతంటూ రోజుల తరబడి ధాన్యాన్ని గోదాములకు తరలించక కేంద్రాల్లోనే ఉంచారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసి రైతన్నలను నట్టేట ముంచాయి. కొన్నిచోైట్లెతే ఏకంగా ధాన్యం వరదలో కొట్టుకుపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడవడమే కాకుండా ఏకంగా వరదలో కొట్టుకుపోయింది. పెద్దచింతకుంట గ్రామంలో తూకం వేసిన సుమారు 300 బస్తాల ధాన్యం సంచులు తడిసిపోయాయి. తడిసిన ధాన్యం బస్తాలను రైస్మిల్లులకు తరలించాలని రైతులు కోరగా తిరిగి కొత్త బస్తాల్లోకి మార్చాలని కేంద్రం సిబ్బంది ఆదేశించడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఓవైపు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెపుతుండగా క్షేత్రస్థాయిలో ఆచరణ కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివ్వం పేట మండలంలోని చిన్నగొట్టిముక్ల, ఏదుల్లాపూర్ కేంద్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నా తూకం వేయకుండా సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం ఆదివారం కురిసిన వర్షానికి తడిసి రైతుల కంట నీటిని తెప్పించాయి. చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి కొనుగోలు కేంద్రంలో లారీల కొరత తీవ్రంగా ఉంది. అరకొరగా లారీలు వచ్చినా రైతుల నుంచి సంచికి రూ.5 చొప్పున వసూలు చేస్తూ రైతన్నలను నట్టేటముంచుతున్నారు. కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో కూడా రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. కొల్చారం మండలంలోని రైస్మిల్ వద్ద లారీలు పెద్దసంఖ్యలో క్యూ కట్టాయి. ఐదు రోజులవుతున్నా లారీ అన్లోడ్ చేయడం లేదంటూ లారీ ్రడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభు త్వం స్పందించి ధాన్యాన్ని తూకం వేయాలని రైతులు గోడు వెల్లబోసుకుంటున్నారు.
ధాన్యం తూకం వేసినప్పటికీ లారీలో ఎక్కించే వరకు రైతులదే బాధ్యతని కొనుగోలు కేంద్రం సిబ్బంది కొర్రీలు పెడుతున్నారు. లారీలు రాక, తూకం వేసిన ధాన్యం తరలించక కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తుంది. ధాన్యాన్ని తూకం వేసి, బస్తాల్లో నింపి వారం రోజులవుతున్నా లారీలు లేవనే కారణంతో ధాన్యాన్ని తరలిస్తలేరు. ఆదివారం కురిసిన వర్షానికి ధాన్యపు బస్తాలు తడిసిపోయాయి. తడిసిన బస్తాలను మేము తీసుకోం, వాటిని తిర్లమర్ల వేయండి, కొత్త బస్తాల్లో వడ్లు జమాంచుండ్రి అని సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వమే తడిసిన వడ్లను కొంటమని అంటుంటే, ఇక్కడ మాత్రం సిబ్బంది ఆచరించడం లేదు. టాపర్లకు కిరాయిలు కట్టుకుంటూ 12 రోజుల నుంచి కేంద్రంలోనే ఉన్నాం, ఇంకా వడ్లు తీసుకుపోతలేరు. అధికారులు సందర్శించి తడిసిన బస్తాలను పక్కకు పెట్టి తడవని బస్తాలనైనా తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలి.