సిద్దిపేట, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం కలిగి ఉంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. దీంతో యావత్తు దేశం ఇటు వైపు చేస్తున్నది. ఈ నియోజకవర్గం నుండి గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. నాటి నుంచి ఇదే ఇక్కడ జరుగుతున్నది. ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధ్దికి పట్టం కడుతున్నారు. బీఆర్ఎస్కు అన్ని గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది. ఈ తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకుపోతున్నారు. విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో సీఎం కేసీఆర్ను గెలిపించుకునేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధ్దమయ్యారు. 2014,2018 సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన కేసీఆర్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే తలమానికంగా నిలిపారు. రవాణా, వైద్యం, తాగునీరు, విద్య, విద్యుత్, ఔటర్ రింగురోడ్డు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆదర్శ గ్రామాలు, ఉద్యాన, ఫారెస్ట్ యూనివర్సిటీలు, ఎడ్యుకేషనల్ హబ్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల ద్వారా సాగునీటి కష్టాలు తీరాయి. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. హల్దీవాగు, కూడవెల్లి వాగుల జీవనదిలా మారాయి. గజ్వేల్ ప్రాంతానికి రైలు సైతం వచ్చింది.దీంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిస్తున్నది. ఈ ఎన్నికల్లో మూడోసారి సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ నామమాత్రంగానే ఉన్నాయని చెప్పాలి.
గజ్వేల్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా మంచిపేరు ఉంది. ఈ నియోజకవర్గంలో గజ్వేల్ పట్టణంతో పాటుగా గజ్వేల్, ములుగు, తూప్రాన్, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక, మండలాలు ఉండగా.. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన మనోహరాబాద్, మర్కూక్ మండలాలతో పాటు గతేడాది కుకునూరుపల్లి మండలం ఏర్పాటైంది. ఇవన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గజ్వేల్ నియోజకవర్గం 1957 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉంది. 7 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలువగా.. 3 సార్లు టీడీపీ అభ్యర్థి, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు, రెండుసార్లు టీఆర్ఎస్ గెలుపొందింది. 1957లో (ఎస్సీ రిజర్వుడు) జేబీ ముత్యాల్రావు (కాంగ్రెస్), 1962లో (ఎస్సీ రిజర్వుడు) గజ్వేల్ సైదయ్య (స్వతంత్ర), 1967లో (ఎస్సీ రిజర్వ్డ్) గజ్వేల్ సైదయ్య (కాంగ్రెస్), 1972లో (ఎస్సీ రిజర్వుడు) గజ్వేల్ సైదయ్య (కాంగ్రెస్), 1978లో గజ్వేల్ సైదయ్య (కాంగ్రెస్), 1983లో (ఎస్సీ రిజర్వుడు) అల్లం సాయిలు (స్వతంత్ర), 1985లో (ఎస్సీ రిజర్వుడు) సంజీవరావు (టీడీపీ), 1989లో (ఎస్సీ రిజర్వుడు) జె.గీతారెడ్డి (కాంగ్రెస్), 1994లో (ఎస్సీ రిజర్వుడు) విజయరామారావు (టీడీపీ), 1999లో (ఎస్సీ రిజర్వుడు) సంజీవరావు (టీడీపీ), 2004లో (ఎస్సీ రిజర్వుడ్) గీతారెడ్డి (కాంగ్రెస్) ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు. 2009 ఎన్నికల్లో జనరల్ స్థానంలో తూంకుంట నర్సారెడ్డి (కాంగ్రెస్) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో జనరల్ స్థానంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీచేసి 20వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో రెండోసారి కేసీఆర్ 58,290 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరుసగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో 19,391 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,290 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట 1983లో టీడీపీ తరపున సిద్దిపేట నుంచి పోటీచేసి తన రాజకీయ గురువైన మదన్మోహన్ చేతిలో కేవలం 879 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం మధ్యంతర ఎన్నికల్లో 1985లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. అప్పటి నుంచి సిద్దిపేటను తన కంచుకోటగా మలుచుకున్నారు. 1985లో టీడీపీ తరపున 16,156 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా వరుస ఎన్నికల్లో 1989లో 13,816 ఓట్ల మెజార్టీ, 1994లో 27,107 ఓట్ల మెజార్టీ, 1999లో 27,555 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ వరుసగా గెలుపొందారు. 2001లో బీఆర్ఎస్ను స్థాపించిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 58,712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. మొత్తం మీద 7 సార్లు ఎమ్మెల్యేగా, మెదక్, కరీంనగర్, మహబూబ్నగర్ స్థానాల నుంచి 5 సార్లు ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. సిద్దిపేట నుంచి ఏడుసార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్కి వచ్చిన ఓట్లు -86,694
టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డికి వచ్చిన ఓట్లు- 67,303
కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి వచ్చిన ఓట్లు -34,085
* ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ 19,391 ఓట్ల మెజార్టీతో విజయం
బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్కి వచ్చిన ఓట్లు -1,25,444 ఓట్లు (60 శాతం)
కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డికి వచ్చిన ఓట్లు-67,154 ఓట్లు (32 శాతం)
* ఈ ఎన్నికల్లో కేసీఆర్ 58,290 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.