న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 2020లో కొవిడ్-19 సమయంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ డేటాను కేంద్రం తాజాగా ఆడిట్ రిపోర్ట్లో వెల్లడించింది. అయితే ఇటీవలి కాలంలో ఈ నిధికి దేశీయ, విదేశీ విరాళాలు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పీఎం కేర్స్ నిధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 8,452.95 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.7,188.63 కోట్లుగా ఉంది.
మార్చిలో ఈ నిధిలో మిగిలిన మొత్తం అంతిమ నిల్వ రూ.8,452 కోట్లుగా నమోదైంది. అయితే ఈ నిధికి దేశీయ విరాళాలు తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు 681.81 కోట్లు ఉండగా, 2025 నాటికి రూ.479.05 కోట్లకు తగ్గిపోయాయి. విదేశీ విరాళాలు రూ.11.35 లక్షల నుంచి రూ.9.28 లక్షలకు పడిపోయాయి. చెల్లింపులు 2024లో రూ.15.60 కోట్లు కాగా, అవి 2025 నాటికి కేవలం రూ.87.85 లక్షలు మాత్రమే జరిగాయి. 2025లో మొత్తం ఆదాయం పెరుగగా, ఇటు దేశీయ, అటు విదేశీ విరాళాలు మాత్రం తగ్గాయి.