Mid Day Meals | మెదక్ మున్సిపాలిటీ, జూలై 1: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. అందుకు తగినట్లుగా మెనూ మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం రోజు నుంచే కొత్త మెనూ అమలు చేస్తున్నారు.
బలవర్ధక బియ్యం..
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పోర్టిఫేడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను చేర్చి ప్రోటీన్ల సమ్మిళితమైన భోజనాన్ని అందజేస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం భోజన చార్జీలను సైతం పెంచింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గతంలో రూ.4.97 ఉండగా, రూ.5.45కు పెంచింది. ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు గతంలో రూ.7.45 ఉండగా, రూ. 8.17కు పెంచింది.
రాగి జావ..
ప్రభుత్వ విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థులకు పోషక విలువలు పెంచేందుకు రాగిజావను సైతం పంపిణీ చేయనున్నది. దశాబ్ది దినోత్సవాల సందర్భంగా జూన్ 20న విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో తొలి దశలో 8 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 12 ఉన్నత పాఠశాలల్లో రాగిజావ పంపిణీని ప్రారంభించింది. జూలై 1 నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందించనున్నారు. ప్రతి విద్యార్థికీ 10 గ్రాములు రాగి పౌడర్, 10 గ్రాముల బెల్లం పౌడర్ను 250 మిల్లీ లీటర్ల నీటితో కలిపిన రాగిజావ పంపిణీ చేయనున్నారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు అందజేయనుండగా, మంగళ, గురు, శుక్రవారాల్లో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 898 ప్రభుత్వ పాఠశాలల్లోని 84,558 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
పిల్లల ఆరోగ్యంపై సర్కార్ దృష్టి పెట్టింది. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు ఆందిస్తున్నది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మధ్యాహ్న భోజనంతో సమతుల ఆహారం అందించేందుకు వీలుగా మెనూ మార్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి వారానికి మూడు కోడి గుడ్లు, కిచిడీ, వెజ్ బిర్యానీతో కూడిన రుచికరమైన భోజనం, రాగిజావ అందిస్తాం, వందశాతం హాజరుతో పాటు సత్ఫలితాలు సాధించాలన్న ధ్యేయంతో సర్కారు బడులను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుంది.
– రాధాకిషన్, జిల్లా విద్యాధికారి