జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్చార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేయగా.. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత చార్జీలపై ఐదు శాతం పెంచింది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మూడు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లా మీదుగా ముంబయి-విశాఖపట్టణం జాతీయ రహదారి-65, కంది మీదుగా నాందేడ్ వరకు జాతీయ రహదారి 161, మెదక్ జిల్లా నుంచి కశ్మీరు – కన్యాకుమారి వెళ్లే జాతీయ రహదారి-44 ఉన్నాయి. గ్యాస్, పెట్రో, డీజిల్, ఎరువులు, నిత్యావసరాలు ఇలా అన్నిరకాల వస్తువులపై వరుసగా ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై భారం మోపుతున్నది. ఇబ్బడి ముబ్బడిగా వివిధ రకాల పన్నులు వేస్తూ నడ్డి విరుస్తున్నది. టోల్చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం మరింత భారం కానున్నది. కరోనా తర్వాత అనేక మంది సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. టోల్చార్జీలు భారీగా పెరగడంతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో అన్నింటి ధరలు పెరగడమే తప్పా మరోటి లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
-సిద్దిపేట, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, మార్చి 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సామాన్యుడిపై మోదీ సర్కారు టోల్దెబ్బ కొట్టింది. జాతీయ రహదారులపై టోల్చార్జీలను బీజేపీ ప్రభుత్వం భారీగా పెంచింది.దీంతో జాతీయ రహదారులపై ప్రయా ణం మరింత భారమైంది.శుక్రవారం రాత్రి నుంచే పెంచిన టోల్ ధరలు అమల్లోకి వచ్చాయి. గ్యాస్, పెట్రో, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు, ఎరువులు, మందులు..ఇలా అన్నిరకాల వస్తువులపై వరుసగా ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం అందరిపైనా భారం మోపుతున్నది. తాజాగా టోల్చార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను బతకనీయడం లేదని కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్చార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలపై పెనుభారం పడింది. మినీబస్సులు, లైట్ మోటార్, సరుకు రవాణా వాహనాలు, భారీవాహనాలు, అతిభారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5శాతం వసూలు చేస్తున్నారు. ఏటా టోల్ చార్జీలను విపరీతంగా పెంచడంతో పాటు రోడ్ సెస్సుల పేరిట కేంద్రం కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నది. కానీ, రాష్ర్టాలకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లా మీదుగా మూడు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లా మీదుగా ముంబయి- విశాఖపట్టణం జాతీయ రహదారి-65 ఒకటి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ మండలం చెరాక్పల్లి మీదుగా ఈ రహదారి వెళ్తున్నది. మునిపల్లి మండలం కంకోల్ వద్ద డెక్కన్ టోల్ప్లాజాను ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా నిత్యం సుమారుగా 25 వేల వరకు అన్నిరకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.ఈ జాతీయ రహదారిపై కంకోల్ గ్రామం వద్ద ఎల్అండ్టీ డెక్కన్ టోల్ప్లాజాను ఏర్పాటు చేసింది. 70 కిలోమీటర్ల వరకు సవరించిన కొత్త టోల్ ధరలను చూసుకుంటే భారీగానే ఉన్నాయి. కారు, జీపు, వ్యాన్ లేదా తేలికపాటి వాహనాలు ఫాస్టాగ్ ద్వారా ఒకవైపు ప్రయాణానికి రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణానికి (చెల్లించిన సమయం నుంచి 24 గంటల్లోపు ) రూ.165 అవుతుంది. తేలికపాటి వాణిజ్య వాహనం, తేలికపాటి సరుకుల వాహనాలు మినీ బస్సులు అయితే ఒకవైపు ప్రయాణానికి రూ. 180 అవుతుంది. బస్సు లేదా ట్రక్కు (రెండు ఇరుసులు) రూ.375, మూడు ఇరుసుల వాణిజ్య వాహనాలకు రూ. 410, భారీ నిర్మాణ యంత్రాలకు, బహుళ ఇరుసుల (4 నుంచి 6 ఇరుసులు) వాహనాలకు రూ. 715 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవైపు వెళ్లడానికి మాత్రమే ఈ రుసుము. అది కూడా ఫాస్టాగ్ ఉంటేనే ఈ ధరలు వర్తిస్తాయి. కాగా, అన్ని కేటగిరీల్లోనూ తిరుగు ప్రయాణానికి 24 గంటల్లోపు వస్తే 25శాతం తగ్గింపు ఉంటుంది.
ఇక రెండో జాతీయ సంగారెడ్డి జిల్లా కంది మీదుగా జోగిపేట, బోడ్పట్పల్లి, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, నిజాంపేట మీదుగా కామారెడ్డి జిల్లా నుంచి నాందేడ్ వరకు జాతీయ రహదారి 161 వెళ్తున్నది. చౌడకూరు మండలం తాడ్దాన్పల్లి వద్ద టోల్గేట్ ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇక మెదక్ జిల్లా నుంచి మూడో హైవే కశ్మీరు నుంచి కన్యాకుమారి వెళ్లే జాతీయ రహదారి-44. దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి -44 మెదక్ జిల్లా మీదుగా కాళ్లకల్, తూప్రాన్, చేగుంట, రామాయంపేట మీదుగా వెళ్తున్నది. ఈ రహదారిపై తుప్రాన్ వద్ద టోల్ప్లాజాను ఏర్పాటు చేశారు. నిత్యం ఈ రహదారిపై 20వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వం టోల్చార్జీలు పెంచడంతో ఆర్టీసీ ప్రయాణం సైతం భారం కానున్నది. టోల్ప్లాజా రేట్లకు అనుగుణంగా ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా వివిధ రకాల పన్నులు వేస్తూ నడ్డి విరుస్తున్నది.కరోనా తర్వాత అనేక మంది సొంత వాహనాలను వినియోగిస్తున్నారు.
టోల్చార్జీలు భారీగా పెరగడంతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఒకవైపు పెరిగిన పెట్రో, డీజిల్ ధరలతో సతమతమవుతుంటే, ఇప్పుడు టోల్ప్లాజాల చార్జీలు పెరగడంతో సొంత వాహనాల్లో వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత వసూలు చేసినా రాష్ట్రంలోని రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారే తప్పా మనకు రావాల్సినవి మాత్రం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అన్ని ధరలను పెంచడం, ప్రజలపై భారం మోపడమే పనిగా మోదీ సర్కారు పెట్టుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ టోల్చార్జీలు పెరగడంతో నిత్యావసర సరుకులపై ధరలు ఆకాశన్నంటనున్నాయి. ఈ తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో అన్నింటి ధరలు పెరగడమే తప్పా మరోటి లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
నేటి నుంచి టోల్ప్లాజా రుసుము పెంపుతో వాహనదారులపై మరింత భారం పడనున్నది. మండలంలోని కంకోల్ గ్రామ శివారులో డెక్కన్ టోల్ప్లాజాలో ఏప్రిల్ 1నుంచి పెరిగిన రుసుము అమల్లోకి వస్తున్నట్లు సిబ్బంది వాహనదారులకు తెలియజేస్తున్నారు. టోల్ప్లాజా నుంచి (1)కారు, జీపు, వ్యాన్, లైట్మోటర్ వాహనాలకు ఒకవైపునకు రూ.110-రెండు వైపులకు రూ.165, జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకవైపునకు రుసుము రూ.55, నెలపాస్ రాకపోకలు సాగించేందుకు రూ.3,700. (2)లైట్ కమర్షియల్,లైట్ గూడ్స్, మినీబస్ వాహనాలకు ఒక వైపు 180, రెండు వైపులకు రూ.270, జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకవైపు రూ.90. నెలపాస్కు రూ.5,975కి పెరిగింది. (3) బస్సు, ట్రక్ ఒక వైపు రూ.375, రెండువైపులా రూ.565, జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకవైపునకు రూ.190.
నెల పాస్కు రూ.12,520. (4) త్రి అక్సల్, కమర్షియల్ ట్రక్ వాహనాలకు ఒక వైపు రూ.410, రెండువైపులకు రూ.615, జిల్లా కమర్షియల్ వాహనాలకు వన్సైడ్ రూ.205. నెల పాస్కు రూ.13,660.(5) హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీ వెహికిల్స్కు ఒకవైపు రూ.590, రెండువైపులకు రూ.885, జిల్లా కమర్షియల్ వాహనాలకు వన్సైడ్కు రూ. 295. నెలపాస్ రూ.19,635.(6) ఓవర్సైజ్డ్ వాహనాలకు ఒక వైపు రూ.715, రెండువైపులకు రూ.1075, జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకవైపునకు రూ.360. నెలపాస్కు రూ.23,900 వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కంకోల్ టోల్ప్లాజా వద్ద పైన తెలిపిన విధంగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అధిక భారం పడుతుంది..
గతంలో ఉన్న టోల్ రుసుము చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఏప్రిల్ 1నుంచి పెరిగిన రేట్లతో వాహనదారులపై అదనపు భారం పడుతుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము ప్రతి సారి పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. గతంలో ఒకవైపు వెళ్లేందుకు రూ.105 ఉండే. ఈ సారి మరో రూ.5 పెరగడంతో ఒక్కసారి వెళ్లడానికి రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. కష్టపడి సంపాదించిన పైసల అన్నీ టోల్ రుసు ము చెల్లించడానికే సరిపోతుంది.
-శివప్రసాద్,కొంశెట్పల్లి, వికారాబాద్ జిల్లా