సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోసారి రుజువైంది. శాసనసభ ఎన్నికల్లో కారు జోరు ఏ మాత్రం తగ్గలేదు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం, పక్కా వ్యూహాలతో కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలకు చెక్ పడింది. ఎన్నికల ప్రకటనకు ముందే అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టి అన్ని వర్గాల మద్దతు కూడగట్టారు. నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో మ్యానిఫెస్టో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికీ తీసుకువెళ్లారు. పల్లెలు, పట్టణాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికలేవైనా ఎల్లవేళలా బీఆర్ఎస్కు అండగా నిలబడిన జిల్లావాసులు ఈ సారి కూడా గులాబీ జెండాకే పట్టం కట్టారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, పటాన్చెరులో గూడెం మహిపాల్రెడ్డి, జహీరాబాద్లో మాణిక్రావు గెలిచారు. అందోల్, నారాయణఖేడ్ స్థానాలు కేవలం ఒక శాతం ఓటు తేడాతో కోల్పోయాయి. రాష్ట్రంలో హస్తం హవా కొనసాగినప్పటికీ, జిల్లాలో మూడు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), డిసెంబర్ 5
సంగారెడ్డి డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామన్న కాంగ్రెస్ కలలను బీఆర్ఎస్ పార్టీ తుత్తునియలు చేసింది. మొత్తం ఐదు సీట్లలో మూ డింటిని సాధించి పట్టు నిలుపుకొన్నది. మాజీ సీఎం కేసీఆర్ సారథ్యం, మాజీ మం త్రి హరీశ్రావు పక్కా వ్యూహంతో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ గులాబీ ఖాతాలో చేరాయి. నారాయణఖేడ్, అందోలు స్థానాలను ఒక శాతం ఓటు తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలను బీఆర్ఎస్ విశ్లేషించుకుంటున్నది.
బీఆర్ఎస్కు పెట్టని కోట
సంగారెడ్డి జిల్లా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్నది. ప్రతి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానా లు బీఆర్ఎస్కే దక్కాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఉద్యమ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో పార్టీ ఓటమిపాలైనప్పటికీ ఆ తర్వాత జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఏకపక్ష తీర్పును ఇచ్చారు. జడ్పీ చైర్మన్ స్థానంతో పాటు ఎంపీపీ పదవులను కైవసం చేసుకున్నది. మున్సిపల్ ఎన్నికల్లోనూ జై కొట్టారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలకుగానూ ఏడు చోట్ల బీఆర్ఎస్ చైర్మన్లు గెలుపొందారు. ఇలా ప్రతి ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు గులాబీ పార్టీకి అండగా నిలిచారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు వెన్నంటే ఉన్నారు. చింతా ప్రభాకర్(సంగారెడ్డి), మహిపాల్రెడ్డి(పటాన్చెరు), మాణిక్ రావు (జహీరాబాద్)లను గెలిపించారు.
మొదటి నుంచి పక్కా వ్యూహంతో..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. ఎన్నికల ప్రకటనకు ముందే కేసీఆర్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటంతో పా టు బీఫామ్లు అందజేశారు. మాజీ మంత్రి హరీశ్రావు పక్కా ప్రణాళికలతో ప్రతిపక్షపార్టీలను చిత్తు చేసేలా వ్యూహరచన చేశారు. అందుకనుగుణంగా నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలతో పాటు ప్రతి వందమంది ఓటర్లకు ఒక బూత్ ఇన్చార్జిని నియమించారు. నియోజకవర్గాల్లో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేసీఆర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కేటీఆర్, హరీశ్రావులు రోడ్షోలు, బహిరంగసభల్లో పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారం చేస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం కష్ట పడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు వేసిన ఎత్తుగడలకుపై ఎత్తులు వేస్తూ గతంలో ఆ పార్టీల వైఫల్యాలు, స్వార్థ రాజకీయాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారు. ఐదు స్థానాల్లో మూడు చోట్ల గులాబీ జెండా ఎగురవేశారు. సంగారెడ్డిలో గెలుపు కోసం తన్నీరు హరీశ్రావు అలుపెరుగకుండా శ్రమించారు. మొదట నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, నాయకులను ఏకతాటిమీదికు తీసుకువచ్చి సమన్వయంతో పనిచేసేలా చూశారు. ఫలితంగా చింతా ప్రభాకర్ తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ సాధించారు.
నియోజకవర్గంలోని సదాశివపేట మున్సిపాలిటీ, సదాశివపేట మండలం, కంది, కొండాపూర్ మండలాల ప్రజలు చింతా ప్రభాకర్కు దన్నుగా నిలిచారు. సదాశివపేట మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీని సొంతం చేసుకున్నారు. ఏడు వేలకుపైగా మెజార్టీతో మహిపాల్రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా వాటికి ఛేదించుకుంటూ విజయతీరాలకు చేరారు. పటాన్చెరు, తెల్లాపూర్, బొల్లారం మహిపాల్రెడ్డికి మంచి మెజార్టీని ఇచ్చాయి. జహీరాబాద్లో గెలుపు కోసం హరీశ్రావు అక్కడి నేతలందరినీ సమన్వయం చేసి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్కు అప్పగించారు. దీంతో మాణిక్రావు కాంగ్రెస్పై 10వేలకుపైగా మెజార్టీతో పొందారు. బీఆర్ఎస్ గెలుపుతో మూడు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది.