మెదక్, మే 3(నమస్తే తెలంగాణ): వాతావరణం పొడిగా ఉందని, వారం పాటు వర్షాలు కురిసే సూచనలు లేనందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల్లో మనోధైర్యం కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా ఉందని, నిర్దేశించిన ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టి తేమ శాతం తకువ ఉండేలా చూసుకోవాలని కోరారు. కేంద్రం నిర్వాహకులు తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు చేరవేయాలని, మిల్లర్లు ధాన్యం దించుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేపట్టి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు. గత నెల 22 నుంచి కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను 14 కాలమ్స్ ప్రొఫార్మాలో ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. గత నెల 22 నుండి మే 1 వరకు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో 40,563 ఎకరాల్లో వరి, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, ఉద్యాన వన శాఖ అధికారి నర్సయ్య, ఇతర జిల్లా అధికారులు వెంకట శైలేశ్, రవిప్రసాద్, శ్రీనివాస్, జెమ్లానాయక్, కరుణ, విజయలక్ష్మి, బ్రహ్మాజీ, జయరాజ్, సహాయ వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యాన వన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.