సిద్దిపేట/ సిద్దిపేట టౌన్, జూన్ 26 : దళిత జర్నలిస్టుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు సిద్దిపేటలో జిల్లా దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ, ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్వర్క్ తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు సోమవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేటలోని డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
డీడబ్ల్యూజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజలింగం మాట్లాడుతూ దళిత జన ఉద్యమకారుడు సీఎం కేసీఆర్ దళితులపై చూపుతున్న ప్రత్యేక కృషికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మంత్రి హరీశ్రావు దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇస్తామని ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తామని ఆదివారం జరిగిన ఐడీ జేఎన్ సమావేశం వెల్లడించడం హర్షణీయమన్నారు. ఐడీజేఎన్ రాష్ట్ర కన్వీనర్ మంద జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి దళిత జర్నలిస్టుకి దళిత బంధు అందించాలని కోరారు. జిల్లాలోని దళిత జర్నలిస్టులకు దళితబంధు ప్రకటించడంపై మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూజేఎస్, ఐడీజేఎన్ ప్రతినిధులు మన్నె వెంకట్, పిన్నింటి ప్రభుదాస్, ఎర్రోళ్ల నర్సయ్య, బాబురావు, చందు, నర్సింహులు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో..
హుస్నాబాద్, జూన్ 26 : దళిత వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మం త్రి హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దళిత జర్నలిస్టులందరికీ దళితబంధు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రకటించడం పై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న మాట్లాడుతూ సిద్దిపేటలో జరిగిన దళిత జర్నలిస్టుల సమావేశంలో మంత్రి హరీశ్రావు అర్హులైన దళిత జర్నలిస్టులందరికీ దళితబంధు వర్తింపజేస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.
కార్యక్రమంలో అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, మున్సిపల్ కౌన్సిలర్ బొజ్జ హరీశ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ జడ్పీటీసీ బీలూనాయక్, భూక్య లక్ష్మణ్, బోజు రవీందర్, దళిత జర్నలిస్టుల సంఘం డివిజన్ నాయకులు జాల శ్రీనివాస్, లింగాల ప్రవీణ్, గడిపె సతీశ్, కుమారస్వామి, వేల్పుల సంపత్, పరశురాములు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.