గజ్వేల్, జూలై1: అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుండడంతో పట్టణాల సమీపంలోని పార్కులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కులో కొత్తగా నిర్మించిన కాటేజీలను త్వరలోనే పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీ అధికారులు త్వరిగతిన పనులు చేపడుతుండడంతో ప్రస్తుతం కాటేజీల పనులు చివరి దశలో ఉన్నాయి. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచనల మేరకు అందరిని ఆకట్టుకునేలా అర్బన్ పార్కును తీర్చిదిద్దారు. అటవీ అందాలను కనులారా వీక్షించాలని భావించే వృక్ష ప్రేమికులకు అర్బన్ పార్కు నాలుగేండ్ల క్రితం అందుబాటులోకి రాగా, పార్కు సమీపంలో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మల్కబావి కొత్తరూపు సంతరించుకున్నది. అర్బన్ పార్కు ప్రధాన ముఖద్వారం, రాశీవనం, జంతువుల ప్రతిమలు, వాచ్ టవర్లు, మట్టి రోడ్ల నిర్మాణం, 100 రకాలకు పైగా మొక్కలను అర్బన్ పార్కులో నాటారు. పద్మవ్యూహాన్ని తలపించేలా మొక్కలను తీర్చిదిద్దారు. పార్కుకు వచ్చే పిల్లలు, పెద్దల కోసం వ్యాయామశాల, ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. పార్కులో అడుగుపెట్టాగానే సందర్శకులను కట్టి పడేసేలా భారీ గ్లోబ్ను అటవీ అధికారులు ప్రత్యేక చొరవతో నిర్మాణం చేయించారు.
అద్భుతంగా కాటేజీల నిర్మాణం…
అర్బన్ పార్కులో పర్యటకుల కోసం నిర్మించిన కాటేజీలు ముస్తాబవుతున్నాయి. గజ్వేల్ పరిధిలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు, కొమురవెళ్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు, వర్గల్ సరస్వతీ ఆలయం, నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు నిత్యం భక్తులు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారు అధిక సంఖ్యలో వస్తుంటారు. రాత్రి బస చేసేందుకు పర్యాటకులకు అర్బన్ పార్కులో నిర్మించిన కాటేజీలు ఎంతగానో ఉపయోగపడుతాయి. పర్యటకులు అధికంగా వచ్చే సమయంలో వారి కోసం ప్రత్యేకంగా భోజనశాల, కాటేజీల నిర్మాణం చేపట్టారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో 12 కాటేజీలను నిర్మించగా, అందులో ఫర్నిచర్ ఏర్పాటు, రెండు భోజనశాలలు, సమావేశ మందిరం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, గార్డెనింగ్లను వంటి సదుపాయాలు కల్పించారు. అటవీ ప్రాంతం మధ్యలో నిర్మించిన కాటేజీలు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా నిర్మించడంతో త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కాటేజీలను సందర్శించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన తర్వాత కాటేజీలను పర్యాటక శాఖకు అప్పగించనున్నట్లు తెలిసింది.
చివరి దశలో కాటేజీ పనులు అర్బన్పార్కులో నిర్మించిన
కాటేజీల పనులు చివరి దశలో ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందకు కలెక్టర్ ఆదేశాలతో పనులు త్వరితగతిన చేపడుతున్నాం. పర్యాటకులకు అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు గజ్వేల్ అర్బన్ పార్కులో నిర్మించాం. అర్బన్ పార్కు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాం. అందరి సమష్టి కృషితో అర్బన్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతున్నాం.
– కిరణ్కుమార్, అటవీ రేంజ్ అధికారి