బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లాపై పడింది. ఒక్కసారిగా వాతావరణం మారింది. చలి తీవ్రతతో ప్రజలెవరూ ఎక్కువగా బయటకు రావడం లేదు. పనుల కోసం వచ్చేవారు స్వెటర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
– సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 5
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 5 : సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా వాతావరణ మారింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఓ వైపు చలితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. తుఫాన్ కారణంగా చలి తీవ్రత మరింత ఎక్కువైంది. చలి తీవ్రతతో ప్రజలెవరూ బయటకు ఎక్కువగా రావడం లేదు. పనుల కోసం బయటకు వచ్చే వారు స్వెట్టర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే ఓ మోస్తరు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడటంతో పాటు చిరుజల్లులు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈదురుగాలులతో కూడిన వాన
వర్గల్, డిసెంబర్ 5: మంగళవారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. చేతికొచ్చిన వరి ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబెట్టారు.ముసురుకు చల్లటి ఈదురుగాలులు తోడయ్యాయి. అత్యవసర ప్రయాణాలు తప్పా ఎక్కుశాతం ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మండలంలోని చాలా గ్రామాల్లో రోడ్లపైనే ఆరబెట్టిన ధాన్యంపై కవర్లు(పాలిథిన్) కప్పి ఉంచారు.