బీఆర్ఎస్ హయాంలో గిరిజన తండాలకు మహర్దశ పట్టింది. ఇప్పటికే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం బీటీరోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 198 కిలోమీటర్ల రోడ్ల నిర్మానానికి రూ.56.74 కోట్లు మంజూరయ్యాయి. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రూ.16.25 కోట్లతో పనులు చేపట్టనున్నది. గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు రూ.40.49 కోట్లు మంజారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిధుల మంజూరుకు కృషి చేసిన ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. బీటీ రోడ్లు మంజూరు చేయడంపై గిరివాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 6
మెదక్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్తుంది. మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలంలోని తండాలకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా టేక్మాల్ మండలంలోని తండాలకు కొత్తగా బీటీ రోడ్లు నిర్మించడానికి రూ.16.25 కోట్లు మంజూరయ్యాయి. చాలా ఏండ్ల నుంచి అధ్వాన్నంగా మారి రాకపోకలకు కష్టంగా ఉన్న తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడంతో ఆయా తండాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ నుంచి…
గిరిజన సంక్షేమ శాఖ నుంచి టేక్మాల్ మండలంలోని గిరిజన తండాలకు కొత్తగా బీటీ రోడ్లు నిర్మించడానికి ప్రభఉత్వం రూ.16.25 కోట్లు మంజూరు చేసింది. వీటిలో టేక్మాల్ మండలంలోని వెల్పుగొండ నుంచి బొల్లికుంట తండా వరకు రూ.1.30 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.04 కోట్లు, బొడ్మట్పల్లి నుంచి కదిలాబాయి తండా వరకు 1.10 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.87 లక్షలు, షాబాద్ బీటీ రోడ్డు నుంచి గన్యాతండా వరకు 2.20 కిలోమీటర్లు రూ.1.76 కోట్లు, నల్లకుంట తండా నుంచి కెల్వ తండా వరకు 2.65 కిలోమీటర్లు రూ.2.13 కోట్లు, మెదక్-బొడ్మట్పల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బధ్యాతండా వరకు 0.60 కి.మీ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.47 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి చెంద్రుతండా వరకు 2.85 కి.మీ రూ.2.27 కోట్లు మంజూరయ్యాయి.
అలాగే ఎల్లుపేట నుంచి షాబాద్దందానీకుంట తండా వరకు 1.40 కి.మీ రూ.1.16 కోట్లు, ఎల్లుపేట నుంచి సర్మానీ కుంట తండా వయా బర్రెన్కలకుంట వరకు 0.80 కి.మీ.లకు రూ.64 లక్షలు, హసన్మహ్మద్పల్లి నుంచి కాదిల్బాయి తండా మెయిన్ రోడ్డు వరకు 3.30 కి.మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.67 కోట్లు, తంప్లూర్ నుంచి నీలవేణి వాగు వయా పొగ్మమ్పల్లి తండా వరకు 2.00 కి.మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.62 కోట్లు, ఎల్లంపల్లి నుంచి మెర్ధాన్కుంట వయా ఎల్లంపల్లి తండా వరకు 2.00 కి.మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.62కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో 158.8 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనుంది. వీటిని తండాల నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం చేయనున్నారు. దీంతో ఆయా తండాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు జైకొడుతున్నారు.