బెజ్జంకి, మార్చి 27: కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్లే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రభుత్వ తీరు వల్లే కరువు సంభవించిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు నింపడంతో పుట్లకొద్దీ పంట పండిందని లక్ష్మీపూర్ గ్రామ మహిళా రైతు పద్మ చెప్పుతుంటే సంతోషం అనిపించింది. కానీ నేటి కాంగ్రెస్ పాలనలో పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కపోతుందన్నారు. మిడ్మానేరులో 16 టీఎంసీల సాగు నీళ్లు ఉన్నా బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నష్టం చేసిందన్నారు. 2 టీఎంసీలతో చెరువులు, కుంటలు నింపితే రైతులు పంటలు పండించుకొని అభివృద్ధి చెందేవారన్నారు. బీఆర్ఎస్ పాలనలో మిడ్మానేరు నీటితో ఎర్రటి ఎండల్లో సైతం చెరువులు, కుంటలు నింపడంతో భూమికి బరువయ్యే పంటలు పండించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, పంట రుణలు తెచ్చుకున్న రైతులను బ్యాంకర్లు వేధిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న బాధలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ ప్రజలు ఎదుర్కోవడం బాధాకరమన్నారు.
తెలంగాణలో పదేండ్ల తర్వాత మళ్లీ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలే పరిస్థితి వచ్చిందని, గ్రామాల్లోని మోటర్ వైండింగ్ దుకాణాల వద్ద రైతులు మరమ్మతుల కోసం క్యూకట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాసమస్యల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుబెట్టుకునేలా పోరాటం చేద్దామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకవైపు రైతులు వేసిన పంటలు ఎండడంతోపాటు అకాలవర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు రైతులను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అప్పులు చెల్లిస్తామని హామీతో కూడిన జీవోను బ్యాంకులకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మిడ్మానేరు నుంచి రెండు టీఎంసీల సాగునీటిని బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు అందించి మిగిలిన పంటను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలను మాయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలో చాలా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ బండి సంజయ్కుమార్ కనీసం పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. వారి వెంట పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్గుప్తా, శ్రీనివాస్రావు, తిరుపతిరెడ్డి, రాజయ్య, శ్రీనివాస్, దేవేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.