ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వైద్యారోగ్య శాఖకు ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేశారు. సర్కారు వైద్యంతో ప్రజల్లోకి వెళ్లేలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. వైద్య విద్య పేదలకు అందేలా మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడితో సేవలు అందిస్తూ పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంటివెలుగుతో కండ్ల సమస్యలు దూరం చేశారు. ఇలా మరెన్నో పథకాలతో ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల దరికి చేర్చారు. దీంతో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకున్న ప్రజలు ఇప్పుడు పోదాం పదా బిడ్డా సర్కారు దవాఖానకు అనే రోజులు వచ్చాయి. – సంగారెడ్డి /మెదక్ (నమస్తే తెలంగాణ), జూన్ 13
సంగారెడ్డి /మెదక్ (నమస్తే తెలంగాణ), జూన్ 13: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇందులో భాగంగా రాష్ట్ర ఏర్పాటు అనంతరం వైద్యారోగ్య శాఖలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా సర్కారు దవాఖానల రూపుమారుస్తూ పడకల సంఖ్య పెంచుతూనే, నూతన దవాఖానలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేశారు. డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు 57 రకాల పరీక్షలను ఉచితంగా అందజేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్లల్లోనే ఆరోగ్యశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ దవాఖానలను మెరుగు పరుస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేశారు.
కొత్త దవాఖానలు.. మెరుగైన వైద్యసేవలు
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యరంగంలో జిల్లాకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయడంతోపాటు కొత్త దవాఖానలు మంజూరు చేశారు. ఫలితంగా జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. జిల్లాకు కొత్తగా వట్పల్లి, అమీన్పూర్ మండలాలకు పీహెచ్సీలు మంజూరయ్యాయి. జిల్లాలో కొత్తగా 173 పల్లె దవాఖానలు, 19 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానకు 450 పడకలతో మెడికల్ కాలేజీకి అనుబంధంగా గవర్నమెంట్ జనరల్ దవాఖానగా మార్చారు. సంగారెడ్డిలో కొత్తగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో రూ.1.66కోట్లతో ప్రభుత్వ దవాఖానలో మౌలిక వసతులు కల్పించారు. రూ.20 కోట్లతో సంగారెడ్డిలో మా తాశిశు సంరక్షణ కేంద్రం దవాఖానను ఏర్పాటు చేశారు.
జహీరాబాద్లో రూ.7.50 కోట్లతో మాతాశిశు కేంద్రం, పటాన్చెరులో రూ.70 కోట్లతో 200 పడకల సూపర్స్పెషాలిటీ దవా ఖాన, రూ.6 కోట్లతో జోగిపేటలో వందపడకల దవాఖాన, నారాయణఖేడ్లో రూ.6 కోట్లతో వంద పడకల దవాఖాన, రూ.11కోట్లతో నారాయణఖేడ్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు. అలాగే రూ.11.50 కోట్లతో కోహీర్లో 50పడకల దవాఖాన, రూ.5 కోట్లతో కరస్గుత్తిలో 30 పడకల దవాఖాన, రూ.4.50 కోట్లతో మిర్జాపూర్లో 30 పడకల దవాఖాన, రూ.4.50 కోట్లతో సదాశివపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను నిర్మించారు.
ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభు త్వ దవాఖానల, పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందజేస్తుంది. నూతనంగా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు దవా ఖానల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించింది. సంగారెడ్డిలో రూ.2 కోట్లతో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. 73 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందజేస్తుంది. నారాయణఖేడ్లో సైతం ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి, నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్ దవాఖానల్లో ప్రభుత్వం కొత్తగా ఉచిత డయాలసిస్ సేవలను ప్రారంభించింది. సంగారెడ్డి, జహీరాబాద్లో టిప్పా స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల్లో రాష్ట్రంలోనే ప్రథమం…
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగేవి కాదు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 10వేలలోపు ప్రసవాలు జరగ్గా ప్రస్తుతం 20వేలకుపైగా ప్రసవాలు జరుగుతున్నాయి. 88శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రస్తుతం జరుగుతున్నాయి.
కేసీఆర్ కిట్, కంటివెలుగు, ఆరోగ్యమహిళ, న్యూట్రీషన్ కిట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో ప్రవేశపెట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 79,169 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. వీటివిలువ రూ.55.68 కోట్లు ఉంటుంది. కంటి సమస్యలతో ఎవ్వరూ బాధపడవద్దన్న లక్ష్యంతో ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడుత కంటివెలుగులో 10.16 లక్షలమందికి కంటి పరీక్షలు చేసి 1.97 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసింది. రెండో విడుత కంటివెలుగులో ఇప్పటివరకు 10.93 లక్షలను పరీక్షించి 1.32 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మహిళలకు ప్రత్యేకంగా పరీక్షలు, చికిత్సలు అందజేసేందుకు ఆరోగ్యమహిళా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం, బిలాల్పూర్, ఆర్సీపురం, జిన్నారం పీహెచ్సీల్లో ఆరోగ్యమహిళా కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 4,174 మంది మహిళలకు వైద్యసేవలు అందజేశారు. గర్భిణుల్లో పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వం కొత్తగా న్యూట్రిషన్ కిట్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 977 మందికి న్యూట్రిషన్ కిట్లు అందజేయనున్నారు. గర్భిణుల వైద్యపరీక్షలు చేసుకునేందుకు ఆసుపత్రులకు వచ్చేందుకు ప్రభుత్వం అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టింది. అన్ని పీహెచ్సీల్లో ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందుతున్న తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలకు ప్రజారోగ్యంపై నమ్మకం పెరిగింది. జిల్లాలోని వైద్యసేవలు అవసరమైన వారంతా ప్రభుత్వ దవాఖానలకు వెళ్తున్నారు.