వానకాలం సీజన్లో ఎరువులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వ్యవసాయ శాఖలు ఎరువులను అందుబాటులో ఉంచాయి. ప్రైవేటు డీలర్లు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్, హాకా కేంద్రాల ద్వారా సీజన్ ఆఖరు వరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నది.
సంగారెడ్డి జిల్లాలో సీజన్ మొత్తం 7,19,529 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేయగా, 1,23,136 టన్నుల ఎరువులు అవసరమవుతాయని, మెదక్ జిల్లాలో 3,43,539 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, 55600 టన్నుల ఎరువులు వినియోగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ మేరకు సరిపడా నిల్వలు ఉన్నాయని రైతులకు భరోసా ఇస్తున్నారు. కావాలని కృత్రిమ కొరత సృష్టించడం,అధిక ధరలకు విక్రయించడం, నకిలీలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
– సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ) సెప్టెంబర్ 23
సంగారెడ్డి, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో అంచనాకు మించి పంటలు సాగయ్యాయి. వానకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవడంతో అంచనా కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వానకాలం సీజన్ 2023లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 7,06,160 ఎకరాల్లో ఉంది.
వ్యవసాయశాఖ సీజన్లో 7,19,529 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేసింది. కాలం కలిసిరావడంతో జిల్లాలో అంచనాకు మించి 7.22 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీంతో రైతులకు సరిపడా ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతున్నది. ప్రైవేటు డీలర్లు, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా, మార్క్ఫెడ్ వద్ద నిల్వలు భారీగా ఉన్నాయి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.
రైతులకు సరిపడా ఎరువులు
వానకాలం సీజన్లో ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డి జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచారు. వానకాలం సీజన్లో మొత్తం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 1,23,136 టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
41,722 టన్నుల యూరియా, 15977 టన్నుల డీఏపీ, 19657 టన్నుల ఎంఓపీ , 36,648 కాంప్లెక్స్ ఎరువులు, 9132 ఎస్ఎస్పీ అవసరం అవుతాయని అంచనా వేశారు. అంచనాకు అనుగుణంగా వ్యవసాయశాఖ జిల్లాలోని 474 మంది ప్రైవేట్ డీలర్లు, 52 పీఏసీఎస్లు, 22 డీసీఎంఎస్, 18 హాకా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు రైతులు 35,801 టన్నుల యూరియా, 17,973 టన్నుల డీఏపీ, 1,474 టన్నుల ఎంఓపీ, 32,549 టన్నుల కాంప్లెక్స్, 1,652 టన్నుల ఎస్ఎస్పీ కొనుగోలు చేసి వినియోగించారు.
ఇప్పటివరకు మొత్తం రైతులు 89,450 టన్నుల ఎరువులను వినియోగించారు. రైతులకు అవసరమైన మిగితా 33,686 టన్నుల ఎరువుల నిల్వలను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పూత దశలో ఉన్న పత్తి, పొట్ట దశలో ఉన్న వరి, చెరుకు పంటలకు యూరియా అవసరం ఉంది. రైతులకు 4,500 టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం 3వేల టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రైవేటు డీలర్ల వద్ద 2వేల మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా వద్ద 692 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. అలాగే మార్కెఫెడ్ వద్ద 500 టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంది. జిల్లాకు రావాల్సిన యూరియా నిల్వలను త్వరగా తెప్పిస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మార్క్ఫెడ్ వద్ద యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వారం రోజుల్లో వానకాలం సీజన్ ముగుస్తుందని, ఇక ఎక్కువగా రైతులకు ఎరువుల అవసరం ఉండదని తెలిపారు.
ఒక్క పత్తి పంటకు మాత్రమే ఒక్కడోసు యూరియా అవసరం అవుతుందని, ఆ మేరకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో ఎరువుల డీలర్లు కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యూరియాతోపాటు ఇతర ఎరువులను అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. యూరియా కొరత లేదని, రైతులు అసత్యప్రచారాలను నమ్మవద్దని కోరారు.
మెదక్లో అందుబాటులో నిల్వలు..
మెదక్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సాగు చేసిన రైతులకు అధికార యంత్రాంగం యూరియాను అందుబాటులో ఉంచింది. ఎలాంటి కొరత లేకుండా ఉండేందుకు ఈసారి ముందుస్తుగానే ఎరువులను సరఫరా చేశారు. పంట ఆయా దశల్లో సీజన్ మొత్తం అందించేలా వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేశారు. డిమాండ్కు సరిపడా యూరియా, డీఏపీ, పొటాష్, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ తదితర ఎరువులను ఎప్పటికప్పుడు తెప్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతానికి అవసరమైన ఎరువుల నిల్వలు మెదక్ జిల్లాలో అందుబాటులో ఉన్నట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు.
అత్యధికంగా యూరియా…
ఇటీవల కాలంలో సాగులో రైతులు ఎక్కువగా యూరియాను వినియోగిస్తున్నారు. భూసారంపై ప్రభావం చూపుతున్న పొటాష్ను తగ్గించ యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. మెదక్ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 3,43,539 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయాధికారులు తెలిపారు. వీటిలో వరి 2,99,966 ఎకరాల్లో, పత్తి 37,801ఎకరాల్లో, కంది 927, జొన్న 65 ఎకరాలు, మొక్కజొన్న 3,500 ఎకరాల్లో, పెసర 592 ఎకరాలు, 1000 ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేశారు.
వీటికనుగుణంగా యూరియా 27వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, ఇప్పటికే 25వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు చేరిందని, మరో 3,200 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలోని పీఏసీఎస్, రైతు ఆగ్రో సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది. అలాగే డీఏపీ 3200 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1650 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,200 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1550 మెట్రిక్ టన్నులు అవసరంగా లెక్కలు వేశారు. ఇప్పటికే డీఏపీ 3200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. 693 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. అవసరమైన యూరియాను జిల్లాకు దిగుమతి చేసుకొని నిల్వ ఉంచారు.
సబ్సిడీపై అందజేత
అవసరమైన ఎరువులను పీఏసీఎస్ ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నారు. పీఏసీఎస్ ద్వారా ఒక్కో యూరియా బస్తాను సబ్సిడీ పోనూ రూ.265కు, డీఏపీను సబ్సిడీ పోనూ రూ.1200లకు అందజేస్తున్నారు. ఇదే ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా బస్తాకు రూ.300పైన తీసుకుంటున్నారు. డీఏపీ రూ.1300-1400లకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఎకరాకు రెండు బస్తాల యూరియా, బస్తా డీఏపీ, బస్తా పొటాష్ అందజేస్తున్నారు. రైతులు తమ పట్టా పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లతో ఎరువులను పొందవచ్చు. ఈనేపథ్యంలో అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచారు.
రైతులకు అందుబాటులో యూరియా
జిల్లాలో వానకాలం సీజన్లో రైతులు యూరియా కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. రైతుల అవసరాలకు అనుగుణంగా సీజన్ చివరి వరకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేస్తాం. జిల్లాలో యూరియా 27వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, ఇప్పటికే 25వేల మెట్రిక్ టన్నుల యూరియా
రైతులకు చేరింది. మరో 3,200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, రైతు ఆగ్రో సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది.
– మేకల గోవింద్, మెదక్ జిలా ్లవ్యవసాయ శాఖ అధికారి