సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, సంగారెడ్డిలో జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఫలితమేదైనా స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతను దేశానికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. యువత ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలన్నారు.
– సంగారెడ్డి/మెదక్ మున్సిపాలిటీ మే 24
మెదక్ మున్సిపాలిటీ, మే 24: క్రీడలు శారీరక, మానసిక ఉల్లసానికి ఎంతో దోహదపడుతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల ద్వారా శారీరక శ్రమ కలిగించాలని అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. సీఎం కప్-2023 జిల్లాస్థాయి క్రీడలు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్తో పాటు పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం యువత చదవాలనే తపనతో మానసిక ఒత్తిడులకు గురవుతున్నారని, దైనందిక జీవితంలో క్రీడలకు సైతం సమయాన్ని కేటాయిస్తే మానసిక ఉల్లాసం పొందవచ్చన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసే అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడలను ఏర్పాటు చేశారన్నారు. నేడు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల రాకతో సంప్రదాయ క్రీడలు కనుమరుగయ్యాయన్నారు. శారీరక శ్రమ లేకపోతే ఆరోగ్యకరంగా ఉండలేమన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలను దేశానికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందన్నారు. యువత ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలన్నారు.
శారీరక వ్యాయామం అవసరం – మెదక్ కలెక్టర్ రాజర్షి షా
యువత క్రీడల్లో రాణించేందుకు శారీరక వ్యాయామాల కోసం ఎన్నో సౌకర్యాలు, వనరులు కల్పించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. క్రీడల్లో రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రతిభను చాటాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా స్థాయిలో మూడు రోజుల పాటు క్రీడలను నిర్వహించి విజయవంతం చేశారని కొనియాడారు. అనంతరం క్రీడల్లో విజయం సాధించి విజేతలకు ఎమ్మెల్యే, కలెక్టర్ కప్, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, జడ్పీ సీఈవో శైలేశ్, మైనింగ్ ఏడీ జయరాజ్, జిల్లా క్రీడాలాధికారి నాగరాజు, శివ్వంపేట, నార్సింగి ఎంపీపీలు హరికృష్ణ, సబిత, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, మెదక్ డీఎస్పీ సైదులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, మే 24: తెలంగాణలో తొలిసారి నిర్వహించిన క్రీడల్లో జిల్లాను క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని, ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లు గ్రామాల్లో ఉన్నారని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన సీఎం కప్-2023 క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. కబడ్డీ పురుషుల్లో ప్రథమస్థానం కొండాపూర్ మండలం జట్టు, ద్వితీయ స్థానంలో మొగుడంపల్లి జట్టు గెలుపొందాయి. మహిళల కబడ్డీలో ప్రథమ స్థానం పటాన్చెరు, ద్వితీయంలో కంది మండల జట్టు నిలిచాయి.
ఖోఖో పురుషుల విభాగంలో చౌటకూర్ మండలం, ద్వితీయ స్థానంలో అందోల్ మండలం జట్టు విజయం సాధించాయి. వాలీబాల్ పురుషులలో రామచంద్రాపురం ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో హత్నూర క్రీడాకారులు మెరుగైన ఆటతీరు కనబర్చి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఫుల్బాల్లో పురుషులు జహీరాబాద్ మండలం ప్రథమస్థానంలో నిలవగా, సంగారెడ్డి మండల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి హాజరై విజయం సాధించిన జట్లకు షీల్డ్లు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను ఈ పోటీలు వెలికితీశాయని, ప్రతి క్రీడాకారుడు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఆడితే గెలుపు వరిస్తుందన్నారు. అందరి సమన్వయం, సహకారాలతో మండల, జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు.
ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తి, పట్టుదలతో ఆడిన క్రీడాకారులందరినీ చైర్పర్సన్ అభినందించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, అన్నింటిని స్ఫూర్తిగా తీసుకుని గెలుపు కోసం శ్రమించాలన్నారు. క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో మెంచు నగేశ్గౌడ్, ఆర్డీవో రవీందర్రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా అధికారులు, క్రీడా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.