సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 30: టెన్త్ ఫలితాల్లో జిల్లా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 98.65 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రెండవ స్థానంలో ఉంది. మార్చి 18వ తేదీన ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 2017-18లో టెన్త్ ఫలితాల్లో జిల్లా మూడో స్థానంలో ఉండగా.. 2021-22లో మొదటి స్థానం, గత రెండు సంవత్సరాల నుంచి వరుసగా జిల్లా రెండవ స్థానంలో ఉంది. టెన్త్ ఫలితాల్లోనూ బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
టెన్త్ ఫలితాల్లో 98.65 ఉత్తీర్ణత శాతంతోజిల్లా రెండవ స్థానంలో ఉంది. జిల్లాలో 7,030 మంది బాలురు, 6,946 మంది బాలికలతో కలిపి మొత్తం 13,788 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 6,920 మంది బాలురు, 6,868 మంది బాలికలతో కలిపి జిల్లాలో మొత్తం 13,976 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 98.44, ఉండగా బాలికల ఉత్తీర్ణత శాతం 98.88 ఉంది. దీని ప్రకారం బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది.
జిల్లాలోని 238 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో అత్యధికంగా చిన్నకోడూర్ మండలంలోని 18 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సిద్దిపేట అర్బన్ మండలంలో 16 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో నిలిచింది. అక్బర్ పేట, భూంపల్లి మండలంలో 9 పాఠశాలలు, అక్కన్నపేట మండలంలోని 10 పాఠశాలలు, బెజ్జంకి మండలంలోని 12, చేర్యాల మండలంలో 11, ధూల్మిట్ట మండలంలో 4, దౌల్తాబాద్ మండలంలో 9, దుబ్బాక మండలంలో 13, గజ్వేల్ మండలంలో 10, హుస్నాబాద్ మండలంలో 7, జగదేవ్పూర్ మండలంలో 8, కోహెడ మండలంలో 13, కొమురవెల్లి మండలంలో 4, కొండపాక మండలంలో 12, కుకునూరుపల్లి మండలంలో 4, మద్దూరు మండలంలో 8, మర్కూక్ మండలంలో 3, మిరుదొడ్డి మండలంలో 9, ములుగు మండలంలో 6, నంగునూరు మండలంలో 10, నారాయణరావుపేట మండలంలో 5, రాయపోల్ మండలంలో 7, సిద్దిపేట రూరల్ మండలంలో 11, తొగుట మండలంలో 7, వర్గల్ మండలంలో 12 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్న 153 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. నంగునూరు మండలంలో అత్యధికంగా 25 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏ సాధించగా.. అత్యల్పంగా చేర్యాల మండలంలో ఒక విద్యార్థికి మాత్రమే 10 జీపీఏ వచ్చింది. గత సంవత్సరం జిల్లాలో 126 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏ సాధించగా.. ఈ సంవత్సరం 153 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 30 : టెన్త్ ఫలితాల్లో జిల్లా రెండోస్థానం సాధించడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి జిల్లా గౌరవాన్ని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి, వారిని సన్మార్గంలో నడిపిస్తూ.. పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షణ చేసిన కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలన్నారు. ఈ మేరకు పదిలో పాసైనా సంతోషంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులతో మాజీ మంత్రి హరీశ్రావు ఫోన్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ బిడ్డను డాక్టర్ చేస్తావా.. మీ కొడుకుని ఇంజినీర్ చేయండి అంటూ ఆత్మీయంగా మాట్లాడారు. మీ బిడ్డ పాసైంది శుభాకాంక్షలు అంటూ.. సంతోషంగా ఉన్నావా అంటూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.