మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి)/సిద్దిపేట అర్బన్, మార్చి 22 : అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్లో శుక్రవారం ముదిరాజ్ కులస్తులకు గ్రామ బహిష్కరణ విధించారు. ముదిరాజ్ కులస్తుల వివరాల ప్రకారం.. ఖాజీపూర్ పెద్ద చెరువులోని చేపలను పట్టి విక్రయించే విషయంలో గ్రామం లో వివాదం ఏర్పడింది. కులవృత్తిని నమ్ముకున్న ముదిరాజ్ కులస్తులకు గ్రామంలో చేపలు పట్టే హక్కు లేదని కొన్ని కులాలు అడ్డుపడుతున్నాయి. 1994లో మత్స్యశాఖ సొసైటీ ఏర్పడినప్పటి నుంచి చేపలు పట్టుకునే పరిస్థితి లేదు. ఏటా చేపలను పట్టకుండా గ్రామంలోని కొన్ని కులాల పెద్దలు అడ్డుపడుతున్నారు. ఈనెల 21న సొసైటీ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకునే క్రమంలో గ్రామానికి చెందిన ఆయా కులాల పెద్దలు అధికారులను బెదిరించి వెనక్కి పంపించారు. గ్రామస్తుల మాట కాదని చెరువులో చేపలు పట్టవద్దని, సొసైటీలో కొత్తగా సభ్యులను ఎలా చేర్చుకుంటారని ఇతర కులాల పెద్దలు ముదిరాజ్లకు గ్రామ బహిష్కరణ విధించారు. గ్రామంలో తమకు ఎవరూ సహకరించడం లేదని, నిత్యావసర సరుకులు లభించడం లేదని ముదిరాజ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గ్రామస్తులు సహకరిస్తే జరిమానా విధిస్తారనే భయంతో గ్రామంలో ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందించామని ముదిరాజ్లు తెలిపారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ బహిష్కరణ విషయమై జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, బీసీ సంక్షేమ అధికారి సరోజ, తహసీల్దార్ జయంత్, ప్రత్యేకాధికారి వీరేశ్, ఎంపీడీవో గణేశ్రెడ్డి శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. తాతల కాలం నాటి నుంచి పెద్ద చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని వస్తుందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల తీర్మానం ప్రకారం చెరువులో పట్టిన చేపలు విక్రయించిన డబ్బులతో గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చెరువు విషయం తప్ప ముదిరాజ్ కులస్తులతో గ్రామస్తులకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. జరిగిన సంఘటనపై కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు తెలిపారు.