ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే జనగామ, చేర్యాల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చేర్యాల మండలంలోని వేచరేణి, ఎల్లదాసునగర్, తాడూరు, చిట్యాల, దానంపల్లి, దొమ్మాట, గుర్జకుంట గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మ, బోనాలు, మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వార్డుల వారీగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ నియోజకవర్గ ఆశీర్వదిస్తే ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని, కష్టసుఖాల్లో తోడుంటానన్నారు.
గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాదన్నారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సేవ చేసేందుకు తనను ఆశీర్వదించి జనగామ అభ్యర్థిగా పంపించారని, తనను ఆదరిస్తే అన్ని విధాలుగా తోడుంటానన్నారు.
రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా బాగు చేశాడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోయిందన్నారు. దేశం మెచ్చిన పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి నంబర్వన్ స్థానంలో తెలంగాణను నిలబెట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెట్టే మాయ మాటలతో గ్రామాల్లోకి వస్తున్నదని, 55 ఏండ్లు అధికారమిస్తే చేయని మంచి పనులు ఇప్పుడు చేస్తామని వాగ్ధానాలు చేస్తున్నదని, వాటిని నమ్మవద్దని కోరారు. 3 గంటల కరెంటు ఇస్తే చాలు అనే కాంగ్రెస్ కావాలో 24గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని చెప్పడంతో మహిళలంతా ఒక్కసారిగా కేసీఆర్ సారే రావాలని నినాదాలు చేశారు.
సౌభాగ్యలక్ష్మి పేరిట ప్రతి ఇంటి మహిళకు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.3వేలు నెలనెలా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్సీ అన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, భూమి లేని పేదలు అకాల మరణం చెందితే కేసీఆర్ బీమా పేరిట రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అభివృద్ధిని పరుగులు పెట్టించిన కేసీఆర్ కావాలో పూటకొక సీఎం మారే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. హనుమంతుడి గుడి లేని గ్రామం లేదని, సీఎం కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గతంలో ఈ ప్రాంత ప్రజలు ఆదివారం ఎమ్మెల్యే అనేవారని, ఆయన వైఖరితో నియోజకవర్గంగా ఉన్న చేర్యాల మండల స్థాయికి పడిపోయిందన్నారు. వ్యక్తిగతంగా తాను ఏవరిని ఆరోపించనని, తనను విమర్శించే వారిని పట్టించుకోనన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా రాజేశ్వర్రెడ్డి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. అవ్వ బాగున్నావా.. పెన్షన్ వస్తుందా? అంటూ కుశల ప్రశ్నలతో ఆకట్టుకున్నారు. కేసీఆర్ సార్ మాకు నెలనెలా పెన్షన్ ఇస్తున్నాడు. సార్ దయతో మంచిగా ఉన్నాం.. మల్లా సీఎం కేసీఆర్ సార్ ప్రభుత్వం రావాలి. తప్పక వస్తుంది. నీవు కూడా గెలుస్తావు అంటూ పల్లాకు దీవెనలు అందించారు.
బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు కాగానే నెల రోజుల్లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించాలని కోరారు. ప్రచార కార్యక్రమాల్లో జనగామ జడ్పీ చైర్మన్ పగాల సంపత్రెడ్డి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచ్లు యేనుగుల దుర్గయ్య, ఎర్రవెల్లి రామ్మోహన్రావు, బుర్ర సబితాశ్రీనివాస్గౌడ్, గాలిపల్లి సుభాషిణి, పుర్మ మమతరాంరెడ్డి, ఎంపీటీసీలు యేనుగుల లక్ష్మీనర్సమ్మనర్సయ్య, మిట్టపల్లి సులోచనాశ్రీనివాస్రెడ్డి, ముచ్చెంతల వినోదచుక్కారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, ఉల్లెంగల ఏకానందం, పర్పాటకం దుర్గారెడ్డి, శివగారి అంజయ్య, ఆకుల రాజేశ్ పాల్గొన్నారు.