మెదక్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శనివారం ఆయన ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి ఆయా నియోజకవర్గాల ఈఆర్వోలు, ఎన్నికలకు సంబంధించిన జిల్లా అధికారులతో సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 4న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి జిల్లా తరఫున సమర్పించేందుకు వివరాలు సిద్ధం చేయాలన్నారు.
18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలి
ఓటరు జాబితా, 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు, జనాభా ప్రాతిపదికన ఓటరు నిష్పత్తి వంటి అంశాలపై సంబంధిత ఈఆర్వోలను తహసీల్దార్లు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల ప్రణాళిక మాదిరిగానే నియోజకవర్గాల ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని, ఇంకా ఎకడైనా ఫారాల పరిషారం తదితర వివరాలు పెండింగ్ ఉంటే తక్షణమే పూర్తి చేసి పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని సూచించారు.
కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఆయా మండలాల్లో తక్షణమే ఎపిక్ డౌన్ లోడ్ చేసుకుని ఓటర్ గుర్తింపు కార్డులు ప్రింటింగ్కు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలన్నీ మరోసారి పరిశీలించి, నివేదికలు అందజేయాలన్నారు. మోడల్, మహిళా పోలింగ్ కేంద్రాలు, పీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించాలన్నారు. ప్రతి మండలానికి ఒక మోడల్ పోలింగ్ కేంద్రం గుర్తించాలని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం ప్రదర్శన కేంద్రాన్ని ఇంకా చురుకుగా కార్యకలాపాలు నిర్వహించేలా తయారు చేయాలన్నారు.
అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డబ్బు, మద్యం, ఇతర మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, కమర్షియల్, ఇన్కంటాక్స్, ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టచర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, సీసీ కెమేరాలు ఏర్పాటుతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
బందోబస్తు ఏర్పాటుచేయాలి
రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్లు, కార్గో కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నిబంధనల మేరకు డబ్బు తరలించేముందు సరియైన పత్రాలు, వాహనాలకు అనుమతు లు ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ముందే ప్రణాళికలు సిద్దం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అన్నారు.
పోలీస్ అధికారులు సమస్యలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, ఆర్డీవో లు జయచంద్ర, అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాస్,ఎన్నికల, పోలీస్ ఉన్నతాధికారులు, పాల్గొన్నారు.