దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం మనదని, పాలపిట్ట సాక్షిగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు ఎప్పుడూ ప్రజల కోసం ఆరాటమే కానీ మరో ఆలోచన లేదన్నారు. నారాయణఖేడ్లోని రెహమాన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన అలయ్బలయ్లో స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ&సీఎం కేసీఆర్ చొరవతోనే నారాయణఖేడ్ దశదిశ మారి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు సూచించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ను నమ్మి పెనంలోంచి పొయ్యిలో పడ్డారని చెప్పారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తుంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూడు గంటలకు తగ్గించారని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు కొనసాగుతున్న పారదర్శక పథకాలన్నీ మళ్లీ పైరవీకార్ల చేతుల్లోకి పోతాయన్నారు. తనలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే డీఎన్ఏ ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారని, మరీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డీఎన్ఏ ఏందన్నారు. ఏబీవీపీ మొదలుకుని తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని, కుర్చీ కోసం ఎన్ని పార్టీలైనా మార్చే వ్యక్తి రేవంత్రెడ్డి అని ఎద్దేవా చేశారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్రెడ్డికి ఇప్పుడు ఆమె దేవతలాగా కనిపిస్తుందని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం రేవంత్రెడ్డిదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీం అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నారాయణఖేడ్, అక్టోబర్ 24: సీఎం కేసీఆర్ది పనితనమే తప్ప పగతనం లేదని, ఎప్పుడూ ప్రజల కోసం ఆరాటమే కానీ మరో ఆలోచన లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణఖేడ్లోని రెహమాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అలయ్బలయ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవ కారణంగానే నారాయణఖేడ్ దశదిశ మారిందని, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయి ప్రతి పొలం వాకిట్లోకి గోదావరి జలాలు పారాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎట్లున్న నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడెట్ల అయిందని గుర్తు చేసిన మంత్రి ముఖ్యంగా తండాలకు అభివృద్ధి ఫలాలను అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు. తండాలను పంచాయతీలు చేసుకోవడంతోపాటు రోడ్లు, నాణ్యమైన విద్యుత్, తండాలు, గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. గిరిజనులను 10శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డబుల్ లేన్ రోడ్లు, మార్కెట్ యార్డు, 150 పడకల దవాఖాన, ఎనిమిది గురుకులాలు, 24 గంటల విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోతరని, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ను నమ్మి పెనంలోంచి పొయ్యిలో పడ్డారని చెప్పారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తుంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూడు గంటలకు తగ్గించారని చెప్పారు. తండాలకు ఏం చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని గిరిజనుల వద్దకు వెళ్లి ఓట్లడుగుతుందని మం త్రి ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు కొనసాగుతున్న పారదర్శక పథకాలన్నీ మళ్లీ పైరవీకార్ల చేతుల్లోకి పోతాయన్నారు. పదకొండు సార్లు కాంగ్రెస్ను గెలిపిస్తే చేయలేని పని ఈ ఒక్కసారి గెలిపిస్తే చేస్తరా.. అని ప్రజలు ఆలోచించాలన్నారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మితే ఆగమైతమని, ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు వారు అడిగే వంద ప్రశ్నలకు ఒకే ఒక సమాధానంగా కర్ణాటకలో కాంగ్రెస్ పాలన, ప్రజల కష్టాలు చాలన్నారు. తనలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే డీఎన్ఏ ఉందని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ అంటున్నారని మరీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డీఎన్ఏ ఏందని ఏబీవీపీ మొదలుకుని బీఆర్ఎస్, తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని, కుర్చీ కోసం ఎన్ని పార్టీలైనా మార్చే వ్యక్తి రేవంత్రెడ్డి అని అన్నారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్రెడ్డికి ఇప్పుడు ఆమే దేవతలాగా కనిపిస్తుందని, ఏ ఎండకా ఆ గొడుగు పట్టే నైజం రేవంత్రెడ్డిదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు బీటీం బీఆర్ఎస్ అని బీజేపీ, బీజేపీకి బీటీం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని తాము ఎవరికి బీ టీం కాదని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల టీం అన్ని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంచివారని, పార్టీ కోసం కష్టపడే తత్వం ఉన్న కార్యకర్తలను తాను ప్రత్యక్షంగా చూశానని మంత్రి కితాబిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామాల్లో పర్యటించి తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను వివరించిన విధంగానే మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం ఉందని, పాలపిట్ట సాక్షిగా సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడంతోపాటు సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా పట్టం కట్టాలని మంత్రి కోరారు.
ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే తనను మరోసారి గెలిపించి సేవచేసే అవకాశాన్ని కల్పించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రజలను కోరారు. గత కాంగ్రెస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబాటుకు గురైన విషయం ప్రజలకు తెలుసని, కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు సహకారంతో కేవలం ఏడేండ్లలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని చేపట్టామన్నారు. ఎన్నికల కారణంగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం, పలు రోడ్లు, తదితర పనులు చేపట్టాల్సి ఉందని పనులన్నీ పూర్తి కావాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మూడోసారి నారాయణఖేడ్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడంతోపా టు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్కు ప్రజలు దీవించాలని ఎమ్మెల్యే కోరారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గడపగడపకూ చేరవేసి ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రైతుబంధు పెట్టుబడిని రూ.16 వేలకు, రూ.400లకు వంట గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేదింటి మహిళకు రూ.3 వేలు, రేషన్కార్డుదారులందరికీ సన్నబియ్యంతో పాటు రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమాను ప్రవేశపెడతామన్నారు. కేసీఆర్ బీమా ద్వారా దాదాపు కోటి మందికి లబ్ధి చేకూరుతుందని, వారికి సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు విస్త్రృతంగా ప్రచారం కల్పించాలన్నారు.
ఈనెల 30వ తేదీన నారాయణఖేడ్లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని మంత్రి హరీశ్రావు నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు గ్రామాలు, తండాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర ముఖ్యనాయకులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాహనాలు ఏర్పాటు చేసుకుని తండోపతండాలుగా సభకు తరలివచ్చే విధంగా చూడాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు ఈనెల 30న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభాస్థలి, హెలిప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డికి నామినేషన్ కోసం రూ.25,116లను మండలకేంద్రమైన సిర్గాపూర్కు చెందిన విద్యార్థి ప్రకాశ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి అందజేశారు. మంగళవారం అలయ్బలయ్ కార్యక్రమం సందర్భంగా నారాయణఖేడ్కు వచ్చిన మంత్రి హరీశ్రావు చేతులమీదుగా సిర్గాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్రావుతో కలిసి ప్రకాశ్ ఈ మొత్తాన్ని భూపాల్రెడ్డికి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీపై, ఎమ్మెల్యే భూపాల్రెడ్డిపై ఉన్న అభిమానంతో నామినేషన్ కోసం డబ్బులు ఇచ్చిన విద్యార్థి ప్రకాశ్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి, టీఎస్టీపీసీ చైర్మన్ మఠం భిక్షపతి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన విధంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాయలో పడకుండా బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కర్ణాటకలోని బీదర్కు చెందిన హాలియాజాన్ సూచించారు. మంగళవారం నారాయణఖేడ్లో జరిగిన అలయ్బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మంత్రి హరీశ్రావు సమక్షంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోగా ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెప్పారు. మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించినప్పటికీ గతంలో మాదిరిగా గ్రామాలకు బస్సులు నడపడం లేదని, కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీ సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని, అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలుచేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని, ఇటువంటి ప్రభుత్వాన్ని మరోసారి దీవించి కాపాడుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.