కంది, ఫిబ్రవరి 28: మనదేశంలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్లో 15వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా మన దేశంలో 7.7 శాతం మంది బాలబాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుండడం ఆవేదన కలిగిస్తున్నదన్నారు. హరిత విప్లవం విజయవంతమైనా పోషకాహార లోపం సమస్య నేటికీ ఉండడం ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అడ్డు అన్నారు. అక్షయ పాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తూ, ఆ లోపాన్ని తొలిస్తున్నదని అభినందించారు.
శాంతియుత, సుసంపన్నమైన సమాజాలు మొదట ఆకలి వంటి జీవన అవసరాలు పరిష్కరించడం ద్వారా మాత్రమే సాధించబడుతాయన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభాపేక్ష లేని సంస్థలను ప్రోత్సహించాలని కోరారు. అన్ని ప్రభుత్వాలు చేయలేవని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. తనవంతుగా అక్షయపాత్రకు ఎన్వీ రమణ రూ.2 లక్షల చెక్కును అందజేశారు. అంతకుముందు అక్షయపాత్ర భోజన తయారీలో నాణ్యతను పెంచే రెండు ఆటోమేటెడ్ రైస్వాషింగ్ మిషన్లు, కర్రీ తయారీకి ఉపయోగించే యంత్రాలు, పాత్రలను శుభ్రపరిచే యంత్రాలను ప్రారంభించారు. అక్షయ పాత్ర సేవలందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు, ఉపాధ్యాయులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస, హైదరాబాద్ ట్రస్టీ, ప్రాంతీయ అధ్యక్షులు సత్యగౌర చంద్ర తదితరులు పాల్గొన్నారు.