జగిత్యాల, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ సర్వీసు క్రమబద్ధీకరణ పొందినవారిలో 35 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లు ఫేక్గా ఉన్నాయంటూ వారికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బోర్డు జారీ చేసిన షోకాజ్ నోటీసులతో మరోసారి కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ అంశం తెరపైకి వచ్చింది. కాం ట్రాక్టు లెక్చరర్లలో ముఖ్యంగా జూనియర్ కాలేజీలో పనిచేసి క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్ల లో ఫేక్ పీజీ సర్టిఫికెట్లతో పాటు, అనేక అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
గతంలోనే ముగ్గురు లెక్చరర్లను సర్వీస్ నుంచి తొలగించగా, తాజాగా మరో 35 మంది పేర్లు బయటకు రావడం పలు అనుమానాలను కలిగిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రా రంభమైన కాంట్రాక్టు లెక్చరర్ వ్యవస్థకు మం గళం పాడుతూ, సుదీర్ఘకాలంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న వారి సేవలను 2023 జూన్ 1న అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3 వేల పైచిలుకు మంది, డిగ్రీ కాలేజీలో పనిచేసే 280 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ నిర్ణయంతో పూర్తిస్థాయి లెక్చరర్లుగా మారారు.
క్రమబద్ధీకరణ పొందిన కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి విద్యార్హత విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2000 సంవత్సరం నవంబర్ 8న జీవో నంబర్ 42, 43 ద్వారా అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకానికి తెరలేపింది. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లందరికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుకు నిర్దేశించిన అర్హతలు ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జూనియర్, లెక్చరర్ పోస్టుకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత సబ్జెక్టులో పోస్టుగ్రాడ్యుయేషన్ సెకండ్ డివిజన్ విత్ 50 శాతం మార్కులు ఉండాలన్నది కనీస అర్హతగా నిర్దేశించారు. ఇక డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి సంబంధిత సబ్జెక్టులో సెకండ్ డివిజన్ పోస్టుగ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు.
2011 వరకు కొనసాగుతూ వచ్చిన కాంట్రాక్టు లెక్చరర్ల ప్రక్రియ తదుపరి నిలిచిపోయింది. డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ల సర్వీస్ క్రమబద్ధీకరణపై పెద్దగా అనుమానాలు వ్యక్తం కావడం లేదు. డిగ్రీ కాలేజీల్లో దాదాపు 800 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా, అందులో నెట్, స్లెట్, పీహెచ్డీ అర్హత కలిగి ఉన్న 250 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారు. మిగిలిన వారి సర్వీసులను క్రమబద్ధీకరించకుండా కొంత సమయం ఇచ్చి, కనీస అర్హతలు సాధిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. అయితే అసలు చిక్కంతా జూనియర్ లెక్చరర్ల వద్దే నెలకొంది. జూనియర్ లెక్చరర్లకు సంబంధించి సరైన క్వాలిఫికేషన్ లేకుండానే చాలా మంది దొడ్డిదారిన చేరారన్న ఆరోపణలు ఉన్నాయి.
జూనియర్ లెక్చరర్ పోస్టుకు సంబంధిత పోస్టుగ్రాడ్యుయేషన్ సబ్జెక్టులో సెకండ్ డివిజన్తో పాటు 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన ప్రధానంగా ఉంది. అయితే ఈ నిబంధనను తుంగలో తొక్కినట్టుగా చెబుతున్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులను ప్రామాణికంగా లెక్కించారేగానీ, సెకండ్ డివిజన్ విత్ 50 శాతం మార్కులు అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. జూనియర్ లెక్చరర్ పోస్టుకు కంపార్ట్మెంట్లో పీజీ పాస్ అయినవారు అనర్హులు.
కంపార్ట్మెంట్లో పాస్ అయినవారు 70 శాతం మార్కులు సాధించినా, పోస్టుకు అనర్హులే అన్నది నిబంధన. అయితే ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోకుండానే రెగ్యులరైజ్ చేశారన్నది ఆరోపణ. 2013లో 150 మంది కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీ ప్రక్రియ చేపట్టినప్పుడు అప్పటి వరంగల్ ఆర్జేడీ గౌస్ అందులో 18 మందికి అర్హతలు లేవని, వారిని విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. అయితే తదుపరి వారిలో కొందరిని ప్రిన్సిపల్ విధుల్లోకి తీసుకొన్నారు. వారందరూ ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పీజీ కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణత సాధించినవారు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ అయినట్టు తెలుస్తున్నది.
లెక్చరర్లుగా విధుల్లోకి తీసుకోవాలంటే కచ్చితంగా పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు ఉండాల్సిందే. అయితే రెగ్యులరైజేషన్ పొందిన లెక్చరర్లలో కొందరు పోస్టుల్లో చేరిన సమయంలో సరైన క్వాలిఫికేషన్ లేకుండానే చేరారని, కాలగమనంలో క్వాలిఫికేషన్లు సంపాదించారని, అలాంటివారి సర్వీస్లను సైతం క్రమబద్ధీకరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒకేషనల్ కేటగిరీలో రెగ్యులరైజేషన్ పొందిన లెక్చరర్ల విషయంలో ఇలా జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారని తెలిసింది. ఎంఎల్టీ, సీజీడీఎం, ఎంపీహెచ్డబ్ల్యూ, రేడియో అండ్ టీవీ, ఫిషరీష్ తదితర కోర్సులకు సంబంధించిన లెక్చరర్ల సర్వీస్ క్రమబద్ధీకరణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూనే చాలామంది విశ్వవిద్యాలయాలు, ఇతర కాలేజీల్లో విద్యాభ్యాసం చేసి స్కాలర్షిప్లు పొందడంతోపాటు డిగ్రీలు పూర్తి చేశారు.
భారత విద్యాహక్కు చట్టం ప్రకారం ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇతర కోర్సులను అధ్యయనం చేయడానికి వీలు లేదు. అలాగే ఒకే విద్యాసంవత్సరం రెండు కోర్సులు చదవడానికి వీలు లేదు. అలా చదివినా, ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ స్కాలర్షిప్లతో విద్యాభ్యాసం చేసి నా నేరంగానే చట్టాలు పేర్కొంటున్నాయి. అయితే కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ, వేతనం పొందుతూ, చాలా మంది బీఎడ్, ఎంఎడ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అధ్యయనం చేశారన్న ఆరోపణలున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వేతనం తీసుకుంటూ, స్కాలర్షిప్లు సైతం ైక్లెమ్ చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేయడానికి వీలులేదని గతంలోనే ఫిర్యాదులు చేశారు.
ఆ ఆరోపణలపై సైతం విచారణ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. దేశంలో కొన్ని వర్సిటీల పేరిట అ నుమతి లేకున్నా పీజీ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. అలాంటి నకిలీ వర్సిటీల జాబితాను విద్యాశాఖ ప్రకటించింది. ఆ విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లు చెల్లవని ప్రకటించా రు. అలాంటివారిని సైతం రెగ్యులరైజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. వయోపరిమితి దా టినవారి సర్వీస్లను సైతం రెగ్యులరైజ్ చేసినట్టుగా సమాచారం. తాజాగా 35 మందివి ఫేక్ సర్టిఫికెట్లు అం టూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని కోణాల్లో మరోసారి ధ్రువీకరణ జరుపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.