జనగామ టౌన్/జనగామ రూరల్/ స్టేషన్ఘన్పూర్/హసన్ పర్తి, ఆగస్టు 9 : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు జనం జేజేలు పలికారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ముఖ ద్వారమైన జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కాన్వాయిపై పూలవర్షం కురిపించారు. ఆయనను చూడడానికి భారీ సంఖ్యలో బీఆర్ ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామయ్యింది.
ఎక్కువ మంది రావడంతో సర్పంచ్ చినబోయిన రేఖ వారికి మంచినీళ్లు, అరటిపండ్లు అందజేశారు. స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమాను లతో కలిసి మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. అధినేతను చూసేందుకు గంటల తరబడి వేచిఉన్నారు. గ్రేటర్ 65 డివిజన్ పరిధిలోని దేవన్నపేట టోల్గోట్ వద్ద మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్కు స్వాగతం పలికారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. జై తెలంగాణ.. జైకేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.