దుబ్బాక, డిసెంబర్ 23: ‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతోపాటు దుబ్బాక ప్రజల అభిమానంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా దుబ్బాకలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాతూ తన విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులతోపాటు యువత, మహిళలు అన్నివర్గాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఓ సైనికులుగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. దుబ్బాక అభివృద్ధిలో అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. నియోజకవర్గంతో పాటు దుబ్బాక మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రస్తుతం దుబ్బాకలో పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంతో అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దుబ్బాక పట్టణంలో రింగ్ రోడ్డుతోపాటు దుబ్బాక-హబ్షీపూర్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతామన్నారు. దుబ్బాక మల్లన్నసాగర్ నుంచి జరుగాల్సిన కాల్వల నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు, వసతి గృహాలు, విద్య, తాగునీరు ప్రతి శాఖలతో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తామన్నారు. దుబ్బాకలో ఆడిటోరియం, వెజ్అండ్నాన్వెజ్ మార్కెట్ భవనం, కూడవెల్లి వాగులో పలుచోట్ల చెక్డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, దానిని మానుకోవాలని సూచించారు. చిల్లర పోస్టులు పెట్టి దిగజారుడు రాజకీయాలు చేయొద్దన్నారు. కించపర్చే విధంగా పోస్టులు పెడితే సహించబోమని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, త్వరలోనే దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పునఃప్రారంభించి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, గన్నే భూంరెడ్డి, ఎల్లారెడ్డి, కొత్త కిషన్రెడ్డి, రామస్వామిగౌడ్, తదితరులున్నారు.
దుబ్బాక, డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం దుబ్బాక బాలాజీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మంజులత దంపతులు ఉత్తర ద్వారం నుంచి స్వామి వారి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో తులాభారం నిర్వహించారు. ఆలయంలోని గోశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమాలలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డి, డిసెంబర్ 23: బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ అమలుచేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం మిరుదొడ్డి టౌన్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వానకాలంలో వర్షాలకు కూలిన ఇండ్ల బాధితులకు పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ అమలుచేసిన పథకాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. కాగా, మిరుదొడ్డిటౌన్లోని మహంకాళి దేవి అమ్మవారి ఆలయ 8వ వార్షికోత్సవం ఈ నెల 25న నిర్వహిస్తుండగా, కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ చైర్మన్ల్ముల స్వామి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ మహంకాళి అమ్మవారి ఆలయ 5వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు తుమ్మల బాల్రాజు, పీఏసీఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి, వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, సర్పంచ్లు శ్రీనివాస్, రాములు, శంకర్, కవితా రాజు, ఎంపీటీసీలు నర్సింహులు, మాజీ ఎంపీపీ పంజాల కవితా శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు సత్యనారాయణ, బాపురెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.