సిద్దిపేట అర్బన్, మార్చి 18: జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తొలిరోజు పరీక్షలు సజావుగా ముగిశాయి. తొలిరోజు పరీక్షకు 99.92 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 80 పరీక్షా కేంద్రాల్లో 13,984 మంది విద్యార్థులకు 13,973 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరయ్యారు. నలుగురు ప్రైవేట్ విద్యార్థులకు నలుగురు హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక నిమిషం నిబంధన అమలు లేనప్పటికీ.. విద్యార్థులు సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణలోనే క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసి జవాబు పత్రాలను సీజ్ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూల్, ఇందిరానగర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో టెన్త్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షలు నిర్వహించాలని, ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల రవాణా పోలీస్ ఎస్కార్ట్తో నిర్వహించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం తప్పకుండా ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మెడిసిన్తో వైద్య శిబిరం తప్పక అందుబాటులో ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
చేర్యాల, మార్చి 18: టెన్త్ వార్షిక పరీక్ష నిర్వహణ కోసం నియమించే ఇన్విజిలేటర్ల నియామకంలో సంబంధిత శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఉపాధ్యాయులను డిపార్ట్మెంటల్ అధికారులుగా, సీనియర్లను డిపార్ట్మెంట్ అధికారుల కింద ఇన్విజిలేటర్లుగా నియమించడంతో పలువురు ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకే మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అదే మండలంలో ఇన్విజిలేటర్గా నియమించాల్సి ఉండగా దాన్ని సైతం జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. చేర్యాల మండలంలో పనిచేస్తున్న వారిని మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో ఇన్విజిలేటర్లుగా నియమించారు. మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో పని చేస్తున్న వారిని చేర్యాల, కొమురవెల్లి మండల కేంద్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, అధికారులుగా నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పరీక్షల నిర్వహణ కోసం నియమించిన డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.