సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేసి సాహిత్య ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన మహామహోపాధ్యాయుడు మల్లినాథసూరి కొల్చారంలో జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొల్చారంలో సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ కలెక్టర్ రాజర్షి షా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగారెడ్డిలో కలెక్టర్ శరత్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొని జిల్లా చెందిన కవి పొన్నగంటి తెలగాన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలకు సమున్నత గౌరవం ఇస్తున్నదన్నారు. కవితలు, రచనలు, పాటలు సమాజాన్ని జాగృతం చేస్తాయన్నారు. సాహిత్యరంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొల్చారంలో సంస్కృత యూనివర్సిటీ ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు కవులు, రచయితలను సన్మానించి, నగదు పురస్కారాలు అందజేశారు.
– సంగారెడ్డి/ కొల్చారం/ మెదక్ అర్బన్, జూన్11
కొల్చారం, జూన్ 11: సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సాహిత్యానికి, సాహితీకారులకు గుర్తింపు దక్కిందని వక్తలు అన్నారు. సీమాంధ్రులు కుట్రలకు మన కవులు, కళాకారులు అణిచివేతకు గురై వెలుగులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లినాథ సూరి పేరిట సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఆయన స్వస్థలం కొల్చారంలో నిర్మిస్తుండడం గర్వకారణమన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొల్చారం మండల కేంద్రంలో ఆదివారం మహామహోపాధ్యాయుడు మల్లినాథ సూరిని మరోసారి స్మరించుకున్నారు. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథులుగా హాజరై మల్లినాథుని పాండిత్యం గురించి వివరించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కరెంటు ఉమాదేవి అధ్యక్షతన వహించారు. ముందుగా శ్రీ రేణుకాదేవి ఆలయం నుంచి బోనాలు, బతుకమ్మలను స్థానిక గ్రంథాలయం వద్ద ఉన్న మల్లినాథసూరి విగ్రహం వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అంగడి బజార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాహితీ రంగానికి మల్లినాథుడు చేసిన సేవలు, మల్లినాథుడి స్మారకార్థం కొల్చారంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వక్తలు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్గుప్తా, గిర్ధావర్ ప్రభాకర్, ఎంపీవో కృష్ణవేణి, ఏపీఎం సుసిల్వ, పంచాయతీ కార్యదర్శులు అంజయ్య, నగేశ్, కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమాదేవి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుల, జడ్పీటీసీ మేఘమాల, మెదక్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు సావిత్రిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, హత్నూర జడ్పీటీసీ ఆంజనేయిలు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, శ్రీ మల్లినాథ సూరి సాహితీ పీఠం అధ్యక్షుడు ఎస్.జగదీశ్ చంద్ర, కార్యదర్శి జులకంటి సంగమేశ్వర్, కోశాధికారి వడ్ల ప్రభాకర్, సభ్యులు పాల్గొన్నారు.
మల్లినాథ సూరి మనకు గర్వకారణం : మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేసిన మల్లినాథ సూరి నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారంలో జన్మించడం మనకు గర్వ కారణమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు సాహిత్య దినోత్సవం సందర్బంగా ఇలాంటి పెద్ద కవులను గౌరవించుకునే అవకాశం లభించడం మంచి విషయమన్నారు. మల్లినాథ సూరి జన్మస్థానమైన కొల్చారంలో ఆయన ఇంటి వద్ద ఎందరో సంస్కృత పండితులు వచ్చి ఆ మట్టిని స్పృశించడంతో కొత్తదనం వస్తుందన్నారు. ఎంతో మంది గొప్ప కవులు మన ప్రాంతంలో ఉన్నారంటే చాలా సంతోషకరమని చెప్పారు. మన సీఎం కేసీఆర్ సంస్కృత యూనివర్సిటీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారంలోని మల్లినాథ సూరితోపాటు వెల్దుర్తిలో కూడా మాణిక్రావు అనే ప్రముఖ కవి ఉన్నట్లు తెలియడంతో నిన్ననే హైదరాబాద్లోని వారి వంశస్తులను గౌరవించినట్లు కలెక్టర్ తెలిపారు.
మల్లినాథ సూరి స్మారక చిహ్నాల ఏర్పాటుకు కృషి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
నాలుగు దశాబ్దాలుగా గ్రామ ప్రజల చిరకాల వాంఛ ప్రముఖ కవి మల్లినాథ సూరి పేరిట స్వగ్రామమైన కొల్చారంలో ఆయన స్మృతులను భావితరాలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో సీఎం కేసీఆర్ మల్లినాథ సూరి సంస్కృత యూనివర్సిటీ ప్రకటించడం హర్షనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతారెడ్డి అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై సూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ మల్లినాథ సూరి సంస్కృత యూనివర్సిటీ ప్రకటించి అందరి అభిప్రాయాలకు దగ్గట్లు నిర్ణయం తీసుకున్నారన్నారు.
కలెక్టర్ ఆఫీస్ ప్రారంభం రోజునే వర్సిటీ పనులకు శ్రీకారం : ఎమ్మెల్యే మదన్రెడ్డి
యాదగిరిగుట్టలో ఏర్పాటు చేస్తామన్న సంస్కృత యూనివర్సిటీ కొల్చారంలో ఏర్పాటు చేయడం మాటలు కాదని, మహా పండితుడు మల్లినాథ సూరి పేరిట సంస్కృత యూనివర్సిటీ కొల్చారంలో ఏర్పాటు చేయడం నా అదృష్టమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మల్లినాథ సూరి పేరిట వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ఎన్నో సార్లు సాంస్కృతిక శాఖ కమిషనర్ రమణాచారి, దేశపతి శ్రీనివాస్తో కలిసి సీఎం కేసీఆర్ను కలువగా, మల్లినాథ సూరి మహా పండితుడని, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం తెలిపారన్నారు. అదే స్థాయిలో మనమంతా గర్వించేలా సంస్కృత యూనివర్సిటీ ప్రకటించారని చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ మెదక్ కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చే రోజునే యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. యూనివర్సిటీ నిర్మాణానికి స్థల ఎంపిక పూర్తయిందని, ఈ ప్రాంత రైతులు చాలా మంచి వారన్నారు. భూములను ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపడం మాటలు కాదన్నారు. వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అనుకున్న స్థాయిలో భూనష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
మల్లినాథ సూరి వంశీయులం కావడం గర్వించదగ్గ విషయం
కోలాచల శ్రీనివాస్ శర్మ, తెలుగు పండితుడు, మల్లినాథసూరి వంశీయుడు ఎంతో మంది సంస్కృత పండితులు వచ్చి మల్లినాథ సూరి గురించి గొప్పగా చెబుతారు. ఆయన నివాసమున్న ఇల్లు మట్టిని స్పృశించి మొక్కుతారు. వాటన్నింటిని చూసి మల్లినాథసూరి వంశీయులం కావడం మేమెంతో గర్విస్తాం.
గతంలో మన కవులకు గుర్తింపు దక్కలేదు : ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మల్లినాథ సూరి వంటి గొప్ప సాహితీవేత్తలు కాశీలో గుర్తించబడ్డారు కానీ, సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, కొందరి దుర్మార్గ చర్యలతో మన కవులు గుర్తించబడలేదని ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కూడా సొంతంగా సాహిత్య ప్రియులు కావడంతో, 2017-18 సంవత్సరంలో హైదరాబాద్లో తెలుగు మహాసభలు పెట్టి మన తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన కవులను, సాహితీవేత్తలను తీసుకువస్తే తెలంగాణనే తెలుగు భాషకు సరైన అడ్డా అని, సరైన ప్రాంతం… అంతే తప్ప ఆంధ్ర ప్రాంతం కాదని తెలిపారన్నారు. మన రాష్ట్రంలో కొల్చారం వాసి అయిన మల్లినాథ సూరి లాంటి ఎందరో మహానుభావులు మన రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఎక్కడా గుర్తింపు దక్కలేదన్నారు. ఇప్పుడిప్పుడే మన ముఖ్యమంత్రి సారథ్యంలో వెలుగులోకి వస్తున్నారని చెప్పారు.