సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తున్నది. జిల్లా ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి (మెదక్), బీబీ పాటిల్(జహీరాబాద్) అనేక సార్లు ప్రతిపాదనలు, వినతులు అందజేసినా కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో కొత్త రైల్వేలైన్లు, విస్తరణ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, రైల్వే టెర్మినల్, మియాపూర్ టూ సంగారెడ్డి మెట్రో పొడిగింపు, నిమ్జ్కు మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి పనులకు ఏ మేర నిధులు కేటాయిస్తారోనని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.
సంగారెడ్డి, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంలో సంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ జిల్లాకు నిధులు కేటాయించలేదన్న విమర్శలున్నాయి. జిల్లాకు సంబంధించిన ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్) ఇక్కడ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు, వినతులు అందజేసినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదు. దీంతో జిల్లా ప్రజలు కేంద్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు, రహదారులు ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులివ్వలేదు. జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఐటీకి సైతం కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించటంలేదు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంగారెడ్డి-జోగిపేట రైల్వేలైన్ కోసం రూ.1,800 కోట్ల నిధులు ఇవ్వాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు. పటాన్చెరు నియోజకవర్గం ఏదుల నాగులపల్లిలో 250 ఎకరాల్లో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని ఉంది. రైల్వేటెర్మినల్ ఏర్పాటు చేయాని కోరినా కేంద్ర ప్రభుత్వం ఇంకా మంజూరు చేయటంలేదు. తెల్లాపూర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జితోపాటు పలు రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులివ్వాలని కోరినా ప్రభుత్వం నిధులు కేటాయించటంలేదు.
తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు నిధులు కేటాయించాలని ఎంపీ ప్రభాకర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో వేచి చూడాలి. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముంబై-జహీరాబాద్-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించటంలేదు. కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్జ్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్జ్కు బడ్జెట్లో నిధులు కేటాయించటంలేదు. హైదరాబాద్-జహీరాబాద్ రెండో రైల్వేలైన్ జాతీయ రహదారి 65 వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. రెండో లైన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపటంలేదు. పటాన్చెరు-ఆదిలాబాద్ మధ్య 316 కిలోమీటర్లమేర రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించటంలేదు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ను పొడిగించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రోలైన్ పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవటంలేదు. జిల్లాలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ పరిశ్రమల విస్తరణకు నిధులు ఇవ్వటంలేదు. నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం బీహెచ్ఈఎల్, ఓడీఎఫ్, బీడీఎల్ పరిశ్రమలను ప్రైవేటీకరించే ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ చర్యలపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్ పరిశ్రమల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించాలని, కొత్త రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.