చేర్యాల, నవంబర్ 20: వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, విచారణ పేరిట కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని సీఎం రేవంత్ కుట్ర పన్నాడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్రేస్లో విచారణకు గవర్నర్ ఏసీబీకి అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయనేది తేటతెల్ల్లమైందన్నారు. బీఆర్ఎస్ను కట్టడి చేయడానికి, కేటీఆర్ను ఎదుర్కోవడానికి రేవంత్రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని పల్లా విమర్శించారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్పై విచారణ పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారన్నారు. స్థ్ధానిక సంస్థల ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు మరో డ్రామా ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ కార్రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి, తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కేటీఆర్పై కేసులు సరికాదన్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ను కట్టడి చేయగలం అనుకోవడం పొరపాటే అన్నారు.