జహీరాబాద్, సెప్టెంబర్ 11: చెరుకు సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు రైతులకు అండగా నిలబడింది. వ్యవసాయ బావులు, బోరుల్లో పుష్కలంగా సాగు నీరు ఉండడంతోపాటు కరెంట్ సమస్య లేకపోవడంతో జహీరాబాద్ డివిజన్లో చెరుకు సాగు భారీగా పెరిగింది.
రైతు బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం కృషి
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ఉంది. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్తో పాటు రాయికోడ్ మండలాల్లోని రైతులు ఏటా చెరుకును క్రషింగ్ కోసం ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీకి తలిస్తారు. రెండేండ్లుగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి, రైతుల పెండింగ్ డబ్బులు చెల్లించేలా కృషి చేసింది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, కలెక్టర్ శరత్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి, పెండింగ్ డబ్బులు చెల్లించేందుకు కృషి చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో భారీ స్థాయిలో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో ట్రైడెంట్ యాజమాన్యంతో పాటు చక్కెర అధికారులు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావుతో సమావేశం ఏర్పాటుచేశారు.
బకాయిలు చెల్లించడంలో ట్రైడెంట్ విఫలం?
చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలు రూ.14.15 కోట్లు. 742 మంది రైతులకు రూ.6.63 కోట్లు, 2072 మంది రైతులకు టన్నుకు రూ.270 చొప్పున రూ.6.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. చెరుకు కోత, రవాణాకు సంబంధించి రూ.74 లక్షల బకాయిలు ఆగస్టు 31 లోపు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు ఆగస్టు చివరి వరకు విధులోకి తీసుకుని పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బిల్లులు చెల్లిస్తామని ట్రైడెంట్ యాజమాన్యం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది.
పార్టీలకతీతంగా చెరుకు రైతుల ర్యాలీకి మద్దతు
జహీరాబాద్లో ఈ నెల 12న భారీ ర్యాలీ నిర్వహించేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిధిలోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల్లో పార్టీలకతీతంగా చెరుకు రైతుల ర్యాలీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం చెరుకు రైతులను మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగస్టు 31 వరకు పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
15 లోగా పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం
చెరుకు రైతులకు రూ.9.05 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులను 15 తేదీలోగా చెల్లిస్తామని ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ఎండీ.రామనాథ్, డైరెక్టరు ఖిజారు యాఫైలు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించి, ఈ ఏడాది క్రషింగ్ సీజన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఫ్యాక్టరీలో మరమ్మతులు ప్రారంభిస్తామని తెలిపారు.
చెరుకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
– చెరుకు సహాయ కమిషనర్ రాజశేఖర్
జహీరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీకి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,12,78,691 చెల్లించినట్లు సంగారెడ్డి జిల్లా చెరుకు సహాయ కమిషనర్ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ తహసీల్దార్ బ్యాంకు ఖాతా నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. 183 మంది చెరుకు రైతులకు డబ్బులు చెల్లించారు. చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను త్వరాల్లో ఇప్పించేందుకు యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదన్నారు. యాజమాన్యం వచ్చే సీజన్లో క్ర షింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు.