సంగారెడ్డి/ మెదక్ రూరల్, సెప్టెంబర్ 20: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. గడిచిన బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఇప్పటికే మూడు సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచింది. వారి రిటైర్మెంట్ వస్సు వయోపరిమితి పెంచడంతోపాటు బెనిఫిట్ కింద నగదును అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నది. 50 ఏండ్ల లోపువారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, సర్వీస్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఏ కారణంగా అయినా మరణిస్తే రూ.20 వేలు, హెల్పర్లకు రూ.10 వేలు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పింఛన్ అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మినీ అంగన్వాడీలను సైతం అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మెదక్ జిల్లాలో 191 మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ కానున్నాయి. ప్రభ్వు నిర్ణయంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడాలేని విధంగా వారిపై వరాల జల్లు కురిపిస్తూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. రిటైర్మెంట్ తర్వాత కూడా వారు బాగుండాలనే సదుద్దేశంతో టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు ఇవ్వడంతో పాటు ఆసరా పింఛన్ సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీలకు అండగా..
గత పాలకులు అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై చిన్నచూపు చూశారు. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వారి శ్రమను గుర్తించి, దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీలకు మూడు సార్లు వేతనాలు పెంచి, అండగా నిలిచారు. ఇప్పుడు 65 ఏండ్లకు ఉద్యోగ విరమణ వయస్సుకు అవకాశం కల్పించారు. ఉద్యోగ విరమణ సమయంలో టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించి, మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయనున్నారు. అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
సంతోషంగా ఉంది..
గత ప్రభుత్వలు మా వేతనాల గురించి, మా గురించి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా ఇబ్బందులు గుర్తించి వేతనాలు పెంచారు. ఇప్పుడు ఉద్యోగ విరమణ వయస్సు, బెనిఫిట్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మినీ కేంద్రాలను ఆఫ్గ్రేడ్ చేస్తూ మాపై దయ చూపారు. ప్రభుత్వ నిర్ణయంపై చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్, మంబోజిపల్లి
సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సముచిత స్థానం ఇచ్చి వేతనాలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పీఆర్సీ ఇవ్వనున్నారు. అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ ధైర్యాన్ని నింపింది. ప్రభుత్వ పథకాలకు అంగన్వాడీలను అర్హులను చేసి సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– శారద, అంగన్వాడీ టీచర్, పాతూరు