ప్రజాగాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని అపోలో దవాఖానలో ఆదివారం మృతిచెందారు. మరణవార్త తెలియడంతో ఆయన స్వస్థలం తూప్రాన్లో విషాదఛాయలు అలుముకొన్నాయి. అభిమానులు, బంధుమిత్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులర్పించారు.
– మెదక్ /సంగారెడ్డి, న్యూస్ నెట్వర్క్, ఆగస్టు6
మెదక్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రజా గాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్(74) ఇక లేరు. హైదరాబాద్లోని అపోలో దవాఖానలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 10 రోజుల క్రితం గుండెపోటుతో గద్దర్ దవాఖానలో చేరారు. ప్రజా గాయకుడిగా, రచయితగా, యుద్ధనౌకగా అందరికీ సుపరిచితమైన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామం అంబేద్కర్ కాలనీలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949 జూన్ 5న జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇంజినీరింగ్ హైదరాబాద్లో పూర్తిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తికోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు.
1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ‘ఆపర రిక్షా’ రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనేక పాటలు రాశారు. పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించేందుకు, దళితులను మేలొలిపేందుకు 1972లో జన నాట్య మండలి ఏర్పడింది. 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లర్గా చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. భార్య విమల, ఇద్దరు కొడుకులు సూర్యకిరణ్, చంద్రకిరణ్ (2003లో చంద్రకిరణ్ అనారోగ్యంతో మరణించాడు). కూతురు వెన్నెల సంతానం.
1997లో గద్దర్పై కాల్పులు
1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది హాజరయ్యారు. 1997 ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి బయటపడిన తర్వాత.. విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు అందించారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావులను తమ తరఫున పంపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర ఎనలేనిది. ఆయన రాసి, పాడిన ‘పొడుస్తున్న పొద్దు’ అనే పాట యావత్ తెలంగాణను చైతన్యం చేసింది.
70 ఏండ్లలో తొలిసారి ఓటు
గద్దర్ తన 70 ఏళ్ల జీవిత కాలంలో తొలిసారి ఓటు వేశారు. సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని భూదేవినగర్లో ఆయన నివాసం ఉన్నారు. గద్దర్ జీవితంలో తొలిసారి తన ఓటు హకును వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసి గొప్ప అనుభూతి పొందారు. గద్దర్తోపాటు ఆయన సతీమణి ఓటు హకును వినియోగించుకున్నారు. ఓటు అనేది రాజకీయ పోరాట రూపమని, ఓట్ల యుద్ధంలో ప్రతి ఒకరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఓట్ల విప్లవం ఎప్పటికీ వర్ధిల్లాలని వ్యాఖ్యానించారు. ప్రతీ ఒకరు తమ ఓటు హకును వినియోగించుకోవడం ద్వారా మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు.
సీఎం ఆలోచనలకు కన్నీళ్లతో వందనం
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనకు కన్నీళ్లతో వందనం పలికారు ప్రజా గాయకుడు గద్దర్. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడం చరిత్రాత్మకం, తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని.. మరికొందరు అమరులయ్యారని, అంబేదర్ రచించిన రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ లేకుంటే తెలంగాణ సాధ్యం కాదని సీఎం చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని గద్దర్ పేర్కొన్నారు. ఈ అంశం తీర్మానంతో ఆగిపోవద్దని, దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయాలన్నారు. అలా చేస్తే తాను సీఎం వెన్నంటి వస్తానని గద్దర్ చెప్పారు.
దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం
‘మాభూమి’ సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన ‘బండెనక బండి కట్టి’ అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేసారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించే ఆయన పాటలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కండ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియజెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్లుగా, సీడీలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.
శోకసంద్రంలో అభిమానులు
రామాయంపేట, తూప్రాన్ ఆగస్టు 6: ప్రజా గాయకుడు, యుద్ధనౌక అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందడంతో ఆయన స్వగ్రామం తూప్రాన్ శోకసంద్రమైంది. ఆయన శిష్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గద్దర్ మృతదేహం తూప్రాన్ వస్తుందని వారి కుటుంబీకులు తెలుపడంతో వందలాదిగా తూప్రాన్లోని ఆయన ఇంటికి అభిమానులు చేరుకున్నారు. చివరకు హైదరాబాద్ అల్వాల్లోని భూదేవినగర్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలియడంతో గద్దర్ మనకిక లేడని బోరునవిలపించారు. గద్దర్ చిన్ననాటి నుంచి తన ఆటపాటలతో తూప్రాన్ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అప్పట్లోనే ఆటపాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. 1997లో గద్దర్పై హత్యాయత్నం జరిగింది. చాలాకాలం పాటు తన శరీరంలో తూటాతోనే జీవించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం తన ఆట పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చారు. పాటలతో గత 50ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి బాధాకరం
మెదక్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఉద్యమ కెరటం, ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి చాలా బాధాకరమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గద్దర్ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అనేక వేదికలపై ఆయన రాసి ఆలపించిన గేయాలు ప్రజలను చైతన్యం చేశాయన్నారు. ‘అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద.. నడుస్తున్న కాలమా’ పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల విప్లవస్ఫూర్తి గద్దర్ అని పేరొన్నారు. సామాజిక న్యాయ ప్రవక్తల మాటలు, భావాలు జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించి ఉంటాయన్నారు.
గద్దర్ మరణం సమాజానికి తీరని లోటు
మెదక్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ప్రాణం పోసిన యోధుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమసమాజ స్థాపన కోసం జీవితాంతం తన పాట ద్వారా గద్దర్ పోరాటం చేశారని గుర్తుచేశారు.