అందోల్, జూన్ 9: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అందోల్ లక్ష్మీ నర్సింహ గార్డెన్లో శుక్రవారం తెలంగాణ సంక్షేమ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శరత్తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించిన అనంతరం రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా రాయికోడ్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పుల్కల్ మండలానికి చెందిన ఓ జంట కులాంతర వివాహం చేసుకున్నది. దీంతో వారికి నగదుతోపాటు ప్రశాంసా పత్రాన్ని అంజేశారు. గొల్ల కుర్మలు డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి ఎంపీ, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే, కలెక్టర్కు గొంగడి కప్పి సన్మానించి, గొర్రెపిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో ఇప్పటివరకు మొత్తం 19,358 మంది లబ్ధిదారులకు రూ.182.35 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇందులో బీసీ, ఈబీసీల్లోని 6,422 మందికి రూ.59.85 కోట్లు, ఎస్సీలోని 2493 మందికి రూ. 24.18 కోట్లు, ఎస్టీ 764 మందికి రూ.71.40 లక్షలు, మైనార్టీలు 96 79 మందికి రూ.91.17 కోట్లు అందించినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు వందల కోట్లు కేటాయించి, సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యారన్నారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, బీసీ కులవృత్తుల వారికి రుణాలు ఇలా దేశం గర్విచేలా ఎన్నో గొప్ప, గొప్ప పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఏ పథకమైనా ఎలాంటి పైరవీ లేకుం డా నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. మీకు చెక్కు లు రావాడానికి ఎవరికైనా డబ్బులిచ్చారా.. అని ప్రశ్నించగా.. లేదు లేదంటూ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు చేతులెత్తి సమాధానం చెప్పారు.
తెలంగాణలో ఎలాంటి పైరవీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, దళిత బంధు, కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇలా అనేక గొప్ప పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసీల్దార్ వెంకటేశం, డీటీ మధుకర్రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, మున్పిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీలు బాలయ్య, కృష్ణవేణి, శైలజ, చైతన్య, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, విజయ్కుమార్, శివకుమార్, రాష్ట్ర నాయకుడు జైపాల్రెడ్డి, వరం చైర్మన్ వీరారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు మల్లికార్జున్, నారాయణ, నాయకులు లింగాగౌడ్, శశికుమార్, శ్రీధర్, వెంకటేశం, కాశీనాథ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.