‘బీఆర్ఎస్ పేదల ప్రభుత్వం, మరోసారి సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలి.’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, సంగారెడ్డి, కొండాపూర్, పుల్కల్, కంది మండలాల్లో మంత్రి పర్యటించారు. జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ,హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డిలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, బీసీ, మైనార్టీ బంధు చెక్కులు, జీవో 59 పట్టాలు, దివ్యాంగులకు పింఛన్ ప్రతాలు అందజేశారు.
కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, పంచాయతీరాజ్ కార్యదర్శులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. వివిధ యూనియన్ల భవన నిర్మాణాలకు కేటాయించిన భూమి పత్రాలను ఆయా ప్రతినిధులకు అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. చెరువుల్లో ఉచిత చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం,పారిశ్రామిక రంగాల్లో జిల్లా దూసుకుపోతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– సంగారెడ్డి/ కొండాపూర్/ సంగారెడ్డి కలెక్టరేట్/ పుల్కల్, సెప్టెంబర్ 16
సంగారెడ్డి/ కొండాపూర్, సెప్టెంబర్ 16: ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, పేదల ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. శనివారం మండల పరిధిలోని గోకుల్ వేంకటేశ్వర గార్డెన్ల్లో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మైనార్టీ బంధు పథకాల చెక్కుల పంపిణీ, 58 జీవో పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యాతనిస్తూ, ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే అదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలనే పక్క రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని, తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా నిలుస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మైనార్టీ బంధు పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభ్వుతం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై దేశవ్యాప్తంగా పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో మైనార్టీ విద్యార్థులకు 16 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యనందిస్తున్నామన్నారు. కులం, మతం వర్గం అని తేడా లేకుండా అందరి కోసం పని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వామన్నారు.
సదాశివపేటలో శ్మశాన వాటికలకు స్థలాలు…
నియోజకవర్గ పరిధిలోని సదాశివపేట పట్టణంలో జాతీయ రహదారి పక్కనే రూ.20 కోట్ల విలువ చేసే 5 ఎకరాల స్థలాన్ని శ్మశాన వాటికలకు ఇచ్చామని, సంగారెడ్డి పట్టణానికి సంబంధించి ముస్లింల కబ్రస్థాన్కు 6 ఎకరాలు, క్రిస్టియన్ల సమాధులకు 6 ఎకరాల స్థాలాన్ని కేటాయిస్తున్నామన్నారు. ఎంతో మంది నిరుపేదల పిల్లలను డాక్టర్లుగా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 87శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
సంగారెడ్డిలో నెలకు 800 నుంచి 900 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగడం విశేషమన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనబడుతుందని, దివ్యాంగుల పింఛన్ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణలో రూ.4,016 లను ఈ నెల నుంచే అందిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని 17,030 మంది దివ్యాంగులకు పెంచిన పింఛన్ను అందజేస్తామన్నారు. జీవో 58 కింద లబ్ధిదారులకు రెగ్యులైజేషన్ పత్రాలు అందజేసి సొంతింటి కలను సాకారం చేశామన్నారు.
పేదలకు ‘డబుల్’ ఇండ్లు వరం…
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకు వరంగా మారాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇంతకు ముందు 50 శాతం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదవారికి అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనాన్నరు. మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని, వాటిని కూడా త్వరలో కొండాపూర్ మండల లబ్ధిదారులకు అందిస్తామన్నారు. డబుల్బెడ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి నిజమైన అర్హులైన లబ్ధిదారులకు డ్రా పద్ధతిన ఎంపిక చేసి వారికి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి తళం ఇస్తున్నామని తెలిపారు.
మంత్రికి ధన్యవాదాలు…
సంగారెడ్డిలో పారామెడికల్ కళాశాల మంజూరు చేయాలని మంత్రిని కోరగానే స్పందించిన మంజూరు చేస్తామని ప్రకటించడంతో మంత్రికి చింతా ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పారామెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి హరీశ్రావు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ భవిష్యత్కు ఎంతగానో కృషి చేస్తున్న చింతా ప్రభాకర్కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కుర్ర సత్యనారాయణ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ మఠం భిక్షపతి, కలెక్టర్ శరత్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్రనం మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జడ్పీటీసీలు కొండల్రెడ్డి, పండల పద్మావతి, సునీతా, డీఆర్వో మెంచు నగేశ్గౌడ్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో చింతా ప్రభాకర్ గెలుపు ఖాయం..
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమని, పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినా చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజక వర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పాటు పడుతున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారన్నారు. ఇలాంటి వ్యక్తిని సంగారెడ్డి ప్రజలుదూరం చేసుకోవద్దని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఆడబిడ్డ ఇంట్లోకి తాగు నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. గతంలో ఒక్క ఎకరా పారిన సందర్భం లేదని కానీ, ఇప్పుడు ఇరం లేకుండా కరెంట్ ఉండటం భూగర్భజాలలు పెరగడంతో సమృద్ధిగా నీళ్లు వస్తూ, పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయన్నారు. ఉమ్మడి జిల్లా రైతులు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మూడు పంటలకు సరిపడా నీళ్లు అందుతుండంతో రైతులు పుట్లకు పుట్లు ధాన్యం పండిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
పట్టణాల అభివృద్ధికి రూ.75కోట్లు…
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని సదాశివపేట పట్టణం అభివృద్ధికి సీం కేసీఆర్ నారాయణఖేడ్ సభలో రూ.75 కోట్లు మంజూరు చేస్తూ ప్రకటించి వెంటనే నిధులు విడుదల చేయడం సంతోషకరమన్నారు. సంగారెడ్డిలో రూ.50 కోట్లకు సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయని, సదాశివపేటలో రూ.25 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటితో పాటు రెండు పట్టణాలకు మరో రూ.20 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పారదర్శకమైన పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు.