రాయికోడ్, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా.. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు, వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని అందోల్ ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని రాయిపల్లి, ఇందూర్, బోగులంపల్లి, నాగ్వార్ గ్రామాల్లోని కాంగ్రెస్ నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఇటిక్యాపల్లి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్కు భూమి పూజచేశారు. ఇందూర్ గ్రామ శివారులోని చెన్న మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సింగితం, నాగన్పల్లి, రాయికోడ్, ఇందూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది మొత్తం ఎన్నికల సంవత్సరమని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఎన్నికల సమయంలో కొందరు పగటి వేషగాళ్లు వస్తారని, గోల్మాల్ చేసేందుకు యత్నిస్తారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే చౌకబారు కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ మున్ముందు దేశ రాజకీయాల్లో రాణించబోతున్నారన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్దన్నపాటిల్, ఎంపీపీ మమతా అశోక్కుమార్, జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, మండల కో-ఆప్షన్ మెంబర్ అబెద్అలీ, వరం వైస్ చైర్మన్ తుకారం, ఏఎంఎస్ వైస్ చైర్మన్ మారుతి, పార్టీ మండల కార్యదర్శి శంకర్, ఎంపీటీసీలు శివకుమార్పాటిల్, పండరి, సర్పంచ్లు నర్సమ్మ, మహిపాల్రెడ్డి, విఠమ్మ కిష్టారెడ్డి, ప్రవీణ్కుమార్, నాయకులు మాణిక్యం, హనుమంతు, మరుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.