నర్సాపూర్,ఫిబ్రవరి 26 : ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవనే నిబంధన ఎత్తివేయాలని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక ఆర్డర్ తీసుకురావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రాయితీపై వ్యవసాయ యంత్రాలను గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని మార్కెట్ యార్డులో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయనే భయంతో చాలామంది రైతులు ట్రాక్టర్లను తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు.
నలుగురికి అన్నం పెట్టే రైతుల కోసం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. రైతులను పెండ్లి చేసుకోవడానికి ఎవరూ ముం దుకు రావడం లేదని, రైతును పెండ్లి చేసుకుంటే రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని శరద్ పవార్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులకు ఆమె సూచించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి 943 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లు మంజూరయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం 147 మంది రైతులకు మాత్ర మే మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ అందించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.
కేసీఆర్ రైతుబందు, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు, సబ్సిడీపై విత్తనాలు తదితర పథకాలను తెచ్చి రైతులకు మేలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని ఇవ్వడం లేదని విమర్శించారు. బోనస్ డబ్బులు చాలామంది రైతులకు అందలేదని, తక్షణమే అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏడీఏ సంధ్యారాణి, ఏవో దీపిక, ఏఈవో దుర్గ్గాప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు షేక్హుస్సేన్, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రైతు రక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.