కొండపాక(కుకునూరుపల్లి)/ శివ్వంపేట, ఏప్రిల్ 13: ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. పంటలు ఎండిపోవడం, అప్పులు కావడం, ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. కుటుంబాల్లో పుట్టెడు దు:ఖాన్ని మిగిలిస్తున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో శనివారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు తీసుకున్నారు.
కుకునూరుపల్లిలో అప్పుల బాధతో యువరైతు…
పంట ఎండిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుకునూరుపల్లికి చెందిన పాల పరమేశ్గౌడ్ (32)బ్యాంకులో ఇంటిలోన్ తీసుకోవడంతో పాటు తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరమేశ్ రెండు నెలలుగా మహిళా సంఘం లోన్ సైతం కట్టలేదు.
తన వ్యవసాయ భూమితో పాటు తన తమ్ముని వ్యవసాయ భూమిలో వరిపంట సాగుచేశాడు. పంట చేతికివస్తే అప్పులు తీరుతాయనుకున్నాడు. ఎన్నో ఆశలతో పంట వేసిన పరమేశ్ ఎండిపోవడంతో నష్టాల బారిన పడ్డాడు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పరమేశ్కు బ్యాంకు అధికారులు పెండింగ్లో ఉన్న ఇంటి లోన్ కట్టాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏప్రిల్ 7నే పొలం వద్దకు వెళ్లి వరి పంటను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
చావు తప్ప మరోమార్గం లేదని పురుగుల మందు తాగాడు. ఇంటివద్ద ఉన్న భార్య, పిల్లలను గుర్తుకు తెచ్చుకుని చివరిసారిగా చూద్దామని ఇంటికి చేరుకున్న పరమేశ్ వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఏం జరిగిందో తెలియని కుటుంబసభ్యులు పరమేశ్ను వెంటనే గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరమేశ్ను పరిశీలించిన వైద్యులు అతడు పురుగుల మందు తాగినట్లు గుర్తించడంతో పాటు అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం పెద్ద దవాఖానకు తరలించాలని సూచించారు.
వైద్యుల సూచన మేరకు ములుగులోని ఆర్వీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతేడాది నవోదయ పరీక్ష రాసిన పెద్ద కూతురు రక్షిత వర్గల్లోని నవోదయ పాఠశాలలో చదువుతున్నది. చిన్న కూతురు రిషిత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నది. పరమేశ్ మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పంట ఎండింది.. కౌలురైతు ప్రాణం పోయింది..
కౌలుకు తీసుకున్న ఆరెకరాల పొలం ఎండిపోవడంతో కుంగిపోయి పురుగుల మందు తాగి మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్పల్లి గ్రామానికి చెందిన తలారి బాలమణి (43) తన భర్తతో కలిసి తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు అదనంగా మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశారు.
ఈసారి యాసంగిలో కౌలుకు తీసుకున్న ఆరు ఎకరాల పొలంలోని రెండు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో పంట ఎండిపోయింది. దీంతో ఈనెల 8న పురుగుల మందు తాగింది. ఆమెను కుమారుడు వెంటనే ములుగులోకి ఆర్వీఎం దవాఖానకు తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 12వ తేదీ మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహిపాల్రెడ్డి తెలిపారు.