చేపల మార్కెట్లు కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కళకళలాడుతుండగా, ఎక్కడ చూసినా మత్స్యకారులు చేపలు పడుతూ సందడి చేస్తున్నారు. వలలకు భారీ చేపలు పడుతుండడంతో సంబురంగా మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక్కో చేప కేజీ నుంచి పది కేజీల వరకు బరువుంటున్నాయి. కొన్ని చోట్ల సాధారణ ప్రజలు సైతం గాలాలు వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొంతమంది మార్కెట్లకు కాకుండా నేరుగా చెరువు గట్ల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇండ్లకు తీసుకెళ్లి తమకు నచ్చిన విధంగా రుచికరమైన వంటకాలు చేసుకుని తింటున్నారు. హోటళ్లు, దుకాణాల్లో రకరకాల పద్ధతుల్లో వండి విక్రయిస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా చేప కూరలు ఘుమఘుమలాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున చేపలు లభించలేదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, ఉచితంగా చేపపిల్లల పంపిణీ పథకాలతో మత్స్యసంపద బాగా పెరిగిందని పలువురు మత్స్యకారులు పేర్కొంటున్నారు. సబ్సిడీపై అందజేస్తున్న వలలు, బోట్లు, వ్యాపారాలకు వాహనాలతో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ) జూలై 29
సంగారెడ్డి/మెదక్, జూలై 29 (నమస్తేతెలంగాణ): తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మత్స్యకారులకు పూర్వవైభవం వచ్చింది. సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోసేలా పథకాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏటా చెరువుల్లో లక్షల సంఖ్యల్లో చేప పిల్లలు వదలడంతో మత్స్యకారులకు ఉపాధి పెరిగింది. ఫలితంగా బెస్తలు, ముదిరాజ్లు చేపల విక్రయంతో వచ్చే ఆదాయంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. పది రోజులుగా వర్షాలు కురవడంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులు, మంజీరా రిజర్వాయర్, చెరువులు, వాగుల్లో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువుల్లో రకరకాల చేపలు సందడి చేస్తున్నాయి. ఏ చెరువు వద్ద చూసినా మత్స్యకారులు చేపలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చేపలు పట్టి అకడికకడే విక్రయిస్తున్నారు. వీటిని చూసేందుకు, చేపలు కొనేందుకు భారీగా ప్రజలు ప్రాజెక్టులు, చెరువులు, వాగుల వద్దకు వెళ్తున్నారు. భారీగా చేపలు పడుతుండడంతో మత్స్యకారులు పెద్ద మొత్తంలో చేపలు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు.
ఏటా పెరుగుతున్న మత్స్య సంపద
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉమ్మడి పాలనలో మత్స్య సంపద అంతంత మాత్రంగానే ఉండేది. ఈ ఏడాది మెదక్, సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మత్స్య సంపద 144.26 శాతం పెరిగింది. గత పాలనలో ప్రాజెక్టులు, చెరువులు, వాగుల్లో చేపలు లేకపోవడంతో మత్స్యకారులైన బెస్త, ముదిరాజ్లకు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి పాలనలో కేవలం 118 చెరువుల్లో మాత్రమే అప్పటి ప్రభుత్వం చేపపిల్లలు మత్స్యకార సొసైటీల ద్వారా వదిలేది. చేప విత్తనాలకు సొసైటీల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్య సంపద పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏటా సింగూరు, నల్లవాగు ప్రాజెక్ట్లు, మంజీరా రిజర్వాయర్, మల్కాపూర్ పెద్దచెరువు, మెలిగిరిపేట ప్రాజెక్ట్లు, యూసూఫ్ చెరువు, హల్దీవాగు, పోచారం డ్యామ్ల్లో లక్షల సంఖ్యలో ఉచితంగా చేపపిల్లలు వదలారు. పది రోజులుగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో చేపల అమ్మకాలు ఇందుకు నిదర్శనం. వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, జలాశయాల నుంచి చేపలు దిగువకు వస్తున్నాయి. బెస్తలు, ముదిరాజ్లు చేపలు పట్టి విక్రయిస్తున్నారు. చేపల్లో కొర్రమట్ట, రహు, బంగారు తీగ, కట్ల, బ్రిగాల, బొచ్చ తదితర రకాల చేపలు విరివిగా లభిస్తున్నాయి. ఒక్కో చేప రెండు నుంచి పది కేజీల వరకు ఉంటున్నది. చేపలు కొనేందుకు ప్రజలు పోటీపడుతున్నారు. దీంతో పట్టణాల్లోని చేపల మార్కెట్లు, గ్రామాల్లోని చెరువు కట్టలపై చేపల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మార్కెట్లకు గతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవి. ప్రస్తుతం స్థానిక చేపలను మార్కెట్కు తరలిస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
మత్య్సశాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో గతేడాది 5 కోట్ల చేప పిల్లలు ఆయా చెరువుల్లో వదిలారు. మార్చి, ఏప్రిల్, మేల్లో మత్స్యకారులు చేపలు పట్టారు. ఈ ఏడాది జిల్లాలో 5.04 కోట్ల చేప పిల్లలు వదలడానికి మత్య్సశాఖ సిద్ధంగా ఉన్నదని ఏడీ డాక్టర్ రజని తెలిపారు. జిల్లాలో మొత్తం 2272 చెరువులున్నా యి. ఇందులో చేపల పెంచడానికి అనువైనవి 1614 చెరువు లు. గతేడాది రూ.4.05 కోట్లతో 59.65 లక్షల చేప పిల్లలు ఈ చెరువుల్లో వదిలారు. రూ.12 లక్షల విలువైన రొయ్య పిల్లలను పోచారం, హల్దీ వాగుల్లో వదిలారు. జిల్లాలోని 2272 మత్స్య సహకార సంఘాల్లో 17000 మంది సహకార సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది మత్స్యకారులు సుమారు రూ.5 కోట్ల విలువైన చేపలు పట్టారు. ఈసారి కురిసిన వర్షాలకు గ్రామాలు, పట్టణాల్లో భారీగా చేపలు పడుతున్నాయి. గ్రామాల్లో రహు కిలోరూ.100కు, కొర్రమట్ట రూ.350 పలుకుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాల్లోని 918 చెరువుల్లో ఏటా ప్రభుత్వం లక్షల సంఖ్యలో ఉచితంగా చేపపిల్లలు వదిలారు. ఈ ఏడాది సింగూరు, నల్లవాగు, మెలిగిరి ప్రాజెక్ట్లతో సహా 51 పెద్ద చెరువుల్లో 19.14 లక్షలు, 867 చిన్న చెరువుల్లో 57 లక్షల చేప పిల్లలు వదిలారు. సింగూర్ ప్రాజెక్ట్లో వెయ్యి టన్నుల రొయ్యలు వదిలారు. జిల్లాలోని 219 మత్స్యకార సొసైటీల్లో 10,789 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా 918 చెరువుల్లో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వం వీరికి సబ్సిడీపై చేపలు పట్టే వలలు, బోట్లు, చేపల తరలింపునకు వాహనాలు అందజేస్తున్నది. ఏటా 18,956 టన్నుల చేపల దిగుబడి వస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మత్స్యకారులకు 18.95 కోట్ల ఆదాయం సమకూరుతున్నది.
మస్తు చేపలొచ్చినయ్
చేపలు కడిగేందుకు గిరాకీ బాగా వస్తున్నది. మూడు రోజుల నుంచి తీరడం లేదు. రోజుకు వెయ్యి రూపాయల వరకు గిరాకీ అవుతున్నది. ఎక్కువ తెల్లచేపలు, కొర్రమీనులు వస్తున్నాయి. విస్తారంగా వానలు పడడంతో ఎక్కడపడితే అక్కడ చేపలు ఎదురెక్కుతున్నాయి. వాటిని పట్టుకొని ప్రజలు ఇక్కడకు తెస్తున్నరు. మాకు పని బాగా ఉంది.
– స్వప్న (మహిళా మత్స్యకారిణి, ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ సిద్దిపేట)
రోజుకు వెయ్యి సంపాదిస్తున్నా..
చెరువులు నిండి చేపలు బాగా వస్తున్నయి. దీంతో ధర సగానికి పడిపోయింది. చేపలు కొనేందుకు చాలా మంది వస్తున్నరు. రూ.500కు కిలో ఉన్న కొర్రమీను ఇప్పుడు 300ల నుంచి 350 లకు అమ్ముతుండ్రు. రావులు, బంగారుతీగ వంద లోపు విక్రయిస్తున్నాం. చేపలు కడిగించినందుకు రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నాను.
– మల్లేశం, మత్స్యకారుడు దుబ్బాక
రోజుకు వెయ్యి సంపాదిస్తున్నా..
చెరువులు నిండి చేపలు బాగా వస్తున్నయి. దీంతో ధర సగానికి పడిపోయింది. చేపలు కొనేందుకు చాలా మంది వస్తున్నరు. రూ.500కు కిలో ఉన్న కొర్రమీను ఇప్పుడు 300ల నుంచి 350 లకు అమ్ముతుండ్రు. రావులు, బంగారుతీగ వంద లోపు విక్రయిస్తున్నాం. చేపలు కడిగించినందుకు రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నాను.
– మల్లేశం, మత్స్యకారుడు దుబ్బాక