మెదక్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం రోడ్డు సేఫ్టీ కమిటీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒకరూ ట్రాఫిక్రూల్స్ పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సూచిక,సైన్, రేడియం బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మూలమలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేసి రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలన్నారు. స్పీడ్ బ్రేక్లు ఏర్పాటు చేసి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. రోడ్డు భద్రత గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని గుర్తుచేశారు. ఎకువ శాతం అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీసీ డీఎం సుధ, డీఎంహెచ్వో చందునాయక్, ఎక్సైజ్ జిల్లా అధికారి రజాక్, సిబ్బంది పాల్గొన్నారు.
మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణాపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని పసిగట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, కిరాణం, మెడికల్ షాపులపై నిఘా పెంచాలని సూచించారు.గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డీఈవో రాధా కిషన్, డీఐఈవో సత్యనారాయణ, ఎక్సైజ్ జిల్లా అధికారి రజాక్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.