గజ్వేల్ అర్బన్, జనవరి7: గజ్వేల్లో 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఒలింపిక్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఈనెల 11వ తేదీ నుంచి జరుగనున్న 49వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లను కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. క్రీడాకారులకు సౌకర్యాలు, క్రీడా మైదానంలో ఏర్పాట్లు, అఫీషియల్స్ షూట్స్, తదితర అంశాలపై ఆర్గనైజేషన్ కమిటీల వివరాలు తెలుసుకుని అభినందించారు.
రాష్ట్ర కబడ్డీ ఫెస్టివల్ పోటీల్లో వెయ్యి మందికి పైగా క్రీడాకారులు, 200 మంది అఫీషియల్స్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ముఖ్యులు మొత్తం 1500 మంది వరకు పాల్గొననున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికుమార్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మద్ది మహేందర్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి సత్యం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.