మెదక్ జిల్లాలో 72 పరీక్ష కేంద్రాలు..
హాజరవనున్న 11,400 మంది విద్యార్థులు
సంగారెడ్డి జిల్లాలో 117 సెంటర్లు,
పరీక్ష రాయనున్న 22,564 మంది విద్యార్థులు
సిద్దిపేటలో 83 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పరీక్ష రాయనున్న 14,931 మంది విద్యార్థులు
ఐదు నిమిషాలు దాటితే అనుమతి లేదు
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి కలెక్టరేట్/సిద్దిపేట/ మెదక్ మున్సిపాలిటీ, మే 22: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులకు 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 11,400 మంది విద్యార్థులకు 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 14,931 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 14,923 మంది రెగ్యులర్, 8 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు ఆయా బృందాలు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించనున్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆయా కేంద్రాలకు సకాలంలో చేరేందుకు అన్ని రూట్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి కలెక్టర్ ఇప్పటికే సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద గల జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయాలని ఆదేశించారు. కాగా, పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు చీటీలు తీసుకు రావద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రతి రోజు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని విద్యార్థులకు హితవు చేశారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ను వెంట తీసుకురావాలని సూచించారు. www.bse.teleangana. bov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోండి
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు డీఈవో తెలిపారు. విద్యార్థులు, పరీక్ష సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానికి పరికరాలు పరీక్షా కేంద్రాలకు తీసుకురాకూడదని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు, పెన్ను, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు సంబంధించిన యూనిఫాంలో కాకుండా ఇతర దుస్తుల్లో పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్షకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలన్నా.. సందేహాలున్నా డీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని.. ఏవైనా సందేహాలుంటే 9440665585 నెంబర్ను సంప్రదించాలన్నారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. 100శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక తరగతులు నిర్వహించాం. ఇందుకు జిల్లా యంత్రాంగం అన్ని వసతులు కల్పించింది. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి. ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. మీరు విజేతలుగా నిలువాలని, ఆశీర్వదిస్తూ తాను ఉత్తరాలు పంపించానని.. వాటికి మీ నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి విశేషమైన స్పందన రావడం తనకు ఆనందాన్ని కలిగించింది. అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుతూ శుభాశీస్సులు.. ఆల్ ది బెస్ట్.
-తన్నీరు హరీశ్రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి