అందోల్, మే 20: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లోనే తడిసి మొలకెత్తుతుంది. యాసంగిలో పండించిన ధాన్యం పూర్తిగా కొనకపోవడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎక్కడ చూసినా రోడ్లు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు ప్రకృతి సైతం పగ పట్టినట్లు వర్షాలు కురుస్తుండడంతో వడ్లు తడుస్తూ ధాన్యం మొలకెత్తుతుంది. అందోల్, చౌటకూర్, పుల్కల్ మండలాల్లో రైతులు వరి సాగుచేశారు. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, సరైన సమయానికి ధాన్యం కొనకపోవడం.. కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో ధాన్యం తడుస్తూ మొలకలు వస్తున్నాయని రైతులు గగ్గ్గోలు పెడుతున్నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
వడ్లను రోడ్లపై ఆరబెట్టుకుని రోజులు గడుస్తున్నా కొనడం లేదు. దీంతో వానకు తడిసి వడ్లు మొలకలు వస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వడ్ల దగ్గరే పడుకోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్తే సీరియల్ ప్రకారం కొంటాం? నీ నంబర్ వచ్చినప్పుడురా.. అంటూ సమాధానం చెబుతున్నారు. ఏ ఒక్క అధికారీ మా బాధలు పట్టించుకోవడం లేదు. పంటలు పండించేందుకు కష్టాలే.. అమ్మేందుకు కష్టాలే… ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్గా దృష్టి పెట్టి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలి.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనకుండా జాప్యం చేస్తూ రైతులను కష్టపెట్టడం కరెక్ట్ కాదు. ధాన్యం అమ్మేందుకు గతంలో ఎన్నడూ ఇంతలా ఇబ్బంది పడలేదు. ఇప్పుడూ మాత్రం చాలా కష్టాలు పడుతున్నాం. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకెత్తుతుంది. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. రానున్న రోజుల్లో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని అధికారులే అంటున్నారు. వర్షాలు పడకముందే ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మేము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.