మెదక్, జనవరి 18(నమస్తే తెలంగాణ): రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
1 జనవరి 2024 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, సరైన గుర్తింపు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలన్నారు. చిరునామా, ఫొటో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని, మరణించిన వారి వివరాలు రికార్డు చేయాలని సూచించారు. ఫామ్ 6,7,8లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు దగ్గరలోని తహసీల్, ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త ఓటరుగా నమోదు కావడానికి ఇదే చివరి అవకాశమని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.