సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. పార్టీలకు అతీతంగా వర్గాలు, జెండర్, వయసుల వారీగా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు చేస్తున్నాయి. అయితే ఈసారి గ్రేటర్ వ్యాప్తంగా భారీగా ఉన్న 30ఏళ్ల లోపు ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వేగంగా ఆయా పార్టీల నాయకులు అడుగులు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో యువతీయువకులు గణనీయంగా పెరగడంతో పార్టీలన్నీ ఈ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
కోటిన్నర జనాభా ఉన్న నగరంలో సగానికి పైగా 35ఏళ్ల లోపే జనాభా ఉంటుంది. ముఖ్యంగా 18ఏళ్ల నుంచి యుక్త వయసు కలిగిన ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ వర్గంలో ఉన్న ఓటర్లే పార్టీలకు ఇప్పుడు కల్పవృక్షంలా మారుతున్నాయి. పార్టీలు నడి వయసు ఓటర్ల కంటే యువ ఓటర్లను దారిలోకి తెచ్చుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, వార్డు కమిటీలు, డివిజన్, కాలనీ, బస్తీ కమిటీలను ఏర్పాటు చేసి తమ వైపునకు తిప్పుకునే యోచనలో ఉండగా.. ఇప్పుడు దశల వారీగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వృత్తుల పరంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్న పార్టీల కన్ను యువ ఓటర్లపై పడింది. దీనికి అనుగుణంగా 18 నుంచి 30 వయసు కలిగిన వారిని గుర్తించడం వారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా స్థానిక నేతలు దృష్టి సారించారు. నామినేషన్ల పర్వంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలలో యువ ఓటర్లకే పార్టీలు ప్రాధాన్యతనివ్వగా… పార్టీలో వచ్చే అవకాశాలు, చేపడుతున్న సంక్షేమ పథకాలను వీరి ద్వారా ప్రచారం చేయించడంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఒకప్పటి రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లుగా యువ ఓటర్లతో ప్రత్యేక సమావేశాలను స్థానికంగానే నిర్వహిస్తూ పార్టీ వైపు ఆకట్టుకుంటున్నాయి.
గ్రేటర్లో అట్టహాసంగా జరిగే వినాయక, దుర్గా నవరాత్రి ఉత్సవాలు పార్టీలకు బాగా కలిసి వచ్చాయి. స్థానికంగా ఏర్పాటు చేసే ఉత్సవ నిర్వాహకులను తమ వైపు ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించడంతోపాటు పార్టీ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. ఇలా అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న పార్టీలు… యువ ఓటర్లకు అక్కున చేర్చుకుంటున్నాయి. మార్నింగ్ వాక్ల నుంచి ఈవినింగ్ చిట్చాట్ల వరకు అన్నింటికి తమ పార్టీ ముచ్చటే చర్చించేలా జాగ్రత్తలు తీసుకుం టున్నారు. దీంతో పోలింగ్ నాటికి ఇందులో 60 శాతం ఓట్లు పడినా… ఆపత్కాలంలో అండగా ఉంటుందని ప్రత్యర్థిని నియంత్రించవచ్చని స్ట్రాటజీతోనే యువ ఓటర్లపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇందుకు బస్తీలో ఉన్న యువతీయువకుల ఓటర్లు, లొకేషన్, మొబైల్ నంబర్ల వారీగా సమాచారాన్ని సేకరిస్తూ ప్రత్యేక గ్రూపులను రూపొందించి వారికి చేరువ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా గల్లీ నేతలు దృష్టి సారించారు.